Harish Rao: కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ(Telangana)కు ఎరువులు తేవడంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) ధ్వజమెత్తారు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేసే దుస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయని మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం వద్ద ఎరువుల కోసం క్యూలో బారులు తీరిన రైతులను చూసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియా ఇవ్వలేని చేతగాని, దద్దమ్మ ప్రభుత్వాలు అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరిగోస పెడుతున్న కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)లకు రైతుల ఉసురు తగులుతుందని వ్యాఖ్యానించారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచి రాష్ట్రానికి ఎరువుల కొరత తీర్చడంలో విఫలమయ్యారని మండి పడ్డారు.
ఢిల్లీకి వెళ్లినా ఎరువుల కొరత
రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఎరువుల కొరతపై నోరు మెదపడం లేదని, రైతుల ఉసరు ఉట్టిగా తాకుతా దని విమర్శించారు. నాలుగు రోజుల నుండి వ్యసాయ పనులు వృధా చేసుకొని రైతు(Farmers)లు ఎరువుల కోసం పడిగాపులు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్(Congress), బిజేపీ(BJP) లకు తగిన గుణపాఠం చెపుతారన్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) 51 సార్లు ఢిల్లీకి వెళ్లినా ఎరువుల కొరత తీర్చలేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తిట్లు ఎక్కువ పని తక్కువ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి(MLA Rajagopal Reddy) అన్నాడని, ప్రజలకు కావాల్సింది తిట్లు కాదని, పని కావాలని చెప్పారు. రేవంత్ రెడ్డికి తిట్ల మీద ఉన్న ద్యాస.. పని మీద లేదన్నారు.
Also Read: Venkata Ramana Reddy: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది: గండ్ర వెంకటరమణారెడ్డి
ఆధార్ కార్డుకు ఒకటే బస్తా ఇస్తా
కేసీఆర్(KCR) ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎరువులు ఎట్లా వచ్చాయి. ఇప్పుడు ఎట్లా రావని రైతులు సూటిగా అడుగుతున్నారని తెలిపారు. వెంటనే ఓటీపీ(OTP), ఒక్క బస్తా విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఉదయం 5 గంటల నుండి ఇక్కడే ఉంటున్నామని, ఒక ఆధార్ కార్డుకు ఒకటే బస్తా ఇస్తామంటున్నారు. ఆధార్ కార్డు, ఓటీపీ అంటూ కాలయాపన చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారని హరీశ్ రావుతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గోస లేదని కాంగ్రెస్(Congress) వచ్చాక నీళ్ళు లేవు, యూరియా(urea) లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడు పంట పండాలి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో హమాలీ ఖర్చులు ఇచ్చి ఇంటికి యూరియా పంపించినట్లు ఈ సందర్భంగా హరీశ్ రావు గుర్తు చేశారు. ఉదయం నుండి రైతులు వచ్చి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకొనే అధికారి లేడు అని అగ్రికల్చర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల పట్ల చిన్న చూపు
పదేళ్లలో కేసీఆర్(KCR) హయాంలో ఎరువుల ఇబ్బంది లేదని అన్నారు. ప్రతి మండలానికి గోదాంలు ఏర్పాటు చేసి, వేసవి కాలం లోనే ఎరువులు స్టాక్ పెట్టామన్నారు. గ్రామం నుండి రైతు కాలు బయట పెట్టకుండా.. హమాలీ, ట్రాన్స్ పోర్ట్ ఖర్చు లేకుండా రైతు సమయం వృధా కాకుండ గ్రామంలోనే ఎరువులు అందించామని తెలిపారు. నాలుగు రోజుల రైతులు ఎదురు చూస్తుంటే ఒక్క లారీ ఒక్క బస్తా ఇస్తామని చెప్పడం బాధాకరం అన్నారు.దేవుని దర్శనం దొరుకుతుంది కానీ ఎరువుల బస్తా దొరకడం లేదని మహిళా రైతు భాగ్యమ్మ చెప్పడం ఈ ప్రభుత్వం రైతుల పట్ల చిన్న చూపుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.రైతుల అవసరాల అనుగుణంగా ఎరువుల బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మళ్ళీ పాత రోజులు వచ్చాయని, ఇదేనా కాంగ్రెస్ మార్పు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని, నానో యూరియా వాడాలని చెప్పడ ద్వారా రైతులపై రూ.500 ల అదనపు భారం వేయడమే అన్నారు. నానో యూరియాతో రైతులకు ఎకరానికి రూ.500ల భారం పడుతుందన్నారు. ప్రభుత్వం సబ్సిడీ నుండి తప్పించుకోడానికి కృత్రిమ ఎరువుల కొరతను సృష్టిస్తోందని అన్నారు. బీహార్ రాష్ట్రంలో ఎన్నికలలో లబ్ధిపొందేందుకు ఎరువుల అక్కడికి తరలిస్తున్నారని ఆరోపించారు.
Also Read: Gadwal Atrocity: గద్వాల జిల్లాలో దారుణం.. ఆస్తి కాజేసి తల్లికి రోగముందని ప్రచారం!