New Sarpanch: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామపంచాయతీ నూతన సర్పంచ్గా గుజ్జుల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గుజ్జుల శ్రీనివాస్ దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ గ్రామ ప్రజల సేవే తన పరమ ధర్మమని ప్రకటించారు. దైవసాక్షిగా నేను గుజ్జుల శ్రీనివాస్, మందలపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్గా బాధ్యతలు స్వీకరిస్తూ, గ్రామ ప్రజల సేవే నా పరమ ధర్మమని ప్రమాణం చేస్తున్నాను. గ్రామాభివృద్ధి కోసం నిజాయితీతో, పారదర్శకంగా పనిచేస్తాను. పదవిని దుర్వినియోగం చేయకుండా, చట్టాలు–నిబంధనలకు లోబడి పాలన సాగిస్తాను” అని తెలిపారు.
నిరుపేదల సమస్యలను ప్రాధాన్యం
గ్రామంలోని ప్రతి కుటుంబానికి సమాన న్యాయం అందేలా కృషి చేస్తానని, కుల, మత, రాజకీయ భేదాలు లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు నడిపిస్తానని పేర్కొన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధే తన ప్రధాన బాధ్యతగా భావిస్తున్నానని స్పష్టం చేశారు. నిరుపేదల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకొని పరిష్కరిస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తానని తెలిపారు. గ్రామ సభలను క్రమం తప్పకుండా నిర్వహించి ప్రజల సూచనలు, అభిప్రాయాలను పాలనలో భాగం చేస్తానని అన్నారు. యువత, మహిళలు, రైతుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని, గ్రామాభివృద్ధి కోసం అవసరమైతే మండల, జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని గుజ్జుల శ్రీనివాస్ స్పష్టం చేశారు.
Also Read:Karimnagar News: స్మశానంలో నిద్రిస్తున్న యువతి.. 3 రోజులుగా తల్లి సమాధి వద్దే.. ఆందోళనలో స్థానికులు!
ప్రజల సమస్యలను ప్రాధాన్యం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అశ్వరావుపేట నియోజకవర్గ శాసన సభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ, ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్గా ఎన్నికైన గుజ్జుల శ్రీనివాస్ గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని మందలపల్లిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు సమన్వయంతో పనిచేస్తే గ్రామం ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా మండల సీనియర్ నాయకులు పర్వతనేని వరప్రసాద్ మాట్లాడుతూ, గుజ్జుల శ్రీనివాస్కు గ్రామ ప్రజలు అందించిన విజయం విశ్వాసానికి ప్రతీక అని అన్నారు. సర్పంచ్గా బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించాలని సూచించారు. గ్రామాభివృద్ధికి తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
గ్రామ పెద్దలు, ప్రజలు సహకరించాలి
ఈ సందర్భంగా దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖతో పాటు ప్రజాప్రతినిధుల సమన్వయం అవసరమని అన్నారు. గ్రామంలో అక్రమ కార్యకలాపాలకు తావు లేకుండా శాంతియుత వాతావరణం కొనసాగేందుకు గ్రామ పెద్దలు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సురేష్, గోపాల్ రావు, ఎస్.కే. రఫీ, రషీద్, శ్రీనివాస్, కిరణ్ , ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read:Karimnagar News: స్మశానంలో నిద్రిస్తున్న యువతి.. 3 రోజులుగా తల్లి సమాధి వద్దే.. ఆందోళనలో స్థానికులు!

