Telangana Farmers: గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణిలో తప్పిదం వలన ఇనుగుర్తి మండలం చిన్ననాగారం రెవిన్యూ పరిధిలోని 130 సర్వే నెంబర్లో యాభై సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న రైతుల భూములకు పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. చిన్ననాగారం రెవిన్యూ పరిధిలోని 130 సర్వే నెంబర్లోని 611 ఎకరాలలో మీట్యాతండా, పంతులు తండాకు చెందిన సుమారు వంద మంది రైతులు భూమి సాగు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009-2012 మధ్యకాలంలో భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు ఆర్ ఓఆర్ అసైన్డ్ పట్టాలు అందజేశారు.
రైతులు ఆర్ధిక ఇబ్బందులు
పట్టాలతో రైతులు బ్యాంకులలో పంట రుణాలు తీసుకొని రుణమాఫీ కూడా పొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో చిన్ననాగారం గ్రామానికి చెందిన 130 సర్వే నెంబర్ నేచర్ ఆఫ్ ల్యాండ్ కాలమ్ లో అడవి గా నమోదు అయింది. అప్పటి నుంచి రైతులకు భూమి పట్టాదారు పాసుబుక్ లు రాకపోవడంతో ప్రభుత్వ పథకాలు రైతు బంధు, రైతు భీమా, రుణమాఫీ అవ్వడం లేదని, రైతులు భూములు అమ్మలేని కొనలేని పరిస్థితులతో రైతులు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. పట్టాల కోసం పలుమార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న ఆటవీ అధికారులు, రెవిన్యూ అధికారులు సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Telangana farmers: పంట ఎండిపోతోంది సారూ.. రైతన్నల ఆవేదన..
సరకులు అమ్మలేకపోతున్నాం
పంతులు తండాకు చెందిన గుగులోత్ చంద్రశేఖర్ తండ్రి నుంచి వారసత్వంగా మూడెకరాల భూమి వచ్చిందన్నారు. పట్టదారు పాసుబుక్ లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందకపోవడంతో పాటు, పండించిన పంటలను సీసీఐ, ఐకేపీ కేంద్రాల్లో అమ్మలేక ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుందని తెలిపారు.అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే తమకు న్యాయం చేయాలని కోరారు.
Also Read: Telangana Politics: స్థానిక సమరంలో రాజుకుంటున్న వర్గపోరు.. అసమ్మతితో నేతలు బేజారు

