Khammam: ఖమ్మం (Khammam) జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో తప్పుడు రికార్డుల ఆధారంగా అసైన్డ్ భూములపై అక్రమ పాస్బుక్లు జారీ చేసిన ఉదంతం వెలుగులోకి రావడం విధితమే..! జూనియర్ అసిస్టెంట్ కోలా బేబీ మరియు ఆమె భర్తపై ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుపై నెలరోజులు గడిచినా మండల తహసిల్దార్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ప్రజల ఫిర్యాదుకు బదులుగా పత్రిక వార్తలపై స్పందన
స్థానిక ప్రజల నుండి ఫిర్యాదు అందినా, తహసిల్దార్ పూర్తిగా మౌనం వహించారనీ ఈమే పై వచ్చిన ఆరోపణలు పత్రికల్లో బయటపడిన తరువాతే కలెక్టర్ ఆదేశాలతో విచారణ మొదలైందనీ, కానీ విచారణ నివేదికలో కూడా కీలక అంశాలను దాచిపెట్టినట్లు ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన వైనం.
Also Read: Khammam District: ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కావడం లేదని.. ధర్నా చేస్తూ యువతి ఆత్మహత్య!
విచారణ నివేదికలో అస్పష్టత
కలెక్టర్కి పంపిన నివేదికలో అధికారులు అసైన్డ్ ల్యాండ్స్పై క్రయవిక్రయాలు జరిగాయని పేర్కొన్నారు. కానీ “POT” (Prohibition of Transfer) చట్టం ఉల్లంఘన అంశాన్ని మాత్రం పూర్తిగా విస్మరించారనీ, EPPBలో ఉన్న సర్వే నంబర్ల భూములపై భౌతిక విచారణలు, రికార్డులు పరిశీలన చేయకుండా కోలా బేబీ చెప్పిన విధంగానే MRO రిపోర్ట్ తయారు చేశారని కార్యాలయంలో సిబ్బంది గుసగుసలాడుతున్నారు.
ఆధారాలు లేకుండా పాస్బుక్లు!
కోలా బేబీ భర్త 2018లో అసైన్డ్ భూములు మరియు పట్టా భూములను సాదా పత్రాల ద్వారా కొనుగోలు చేసినట్లు కలెక్టర్కి ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్నారు కానీ వాటికి సంబంధించిన కొనుగోలు పత్రాలు, 11బీ, 12బీ, అమ్మిన వారి వారసుల వాంగ్మూలాలు, సాదా బైనామా పట్టా వివరాలు రికార్డుల్లో లేవని ఆర్టీఐ ద్వారా స్పష్టమైందనీ, సరైన ఆధారాలు లేకుండానే ఈ జంట డిజిటల్ పాస్బుక్లు పొందినట్లుగా ఆధారాలు ఉన్నప్పటికీ ఎమ్మార్వో మాత్రం ఆమెను ప్రశ్నించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న నిబంధనల ఉల్లంఘన
ప్రభుత్వ ఉద్యోగి లేదా ఉద్యోగికి చెందిన భార్య/భర్త అసైన్డ్ భూములు కొనుగోలు చేయరాదని చట్టం స్పష్టంగా చెబుతోన్నప్పటికీ, కోలా బేబీ భర్త అసైన్డ్ భూములు కొనుగోలు చేసి చట్టాన్ని బహిరంగంగా ఉల్లంఘించారనీ నిరూపితమైనా కూడా విచారణ నివేదికలో ఈ అంశాన్ని పూర్తిగా దాటవేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎస్టీ కాలనీకి చెందిన సర్వే నంబర్లపై డిజిటల్ పాస్బుక్లు
192, 195 గల సర్వే నంబర్లు శాటిలైట్ మ్యాప్లో ఎస్టీ కాలనీ గృహనిర్మాణ స్థలాలుగా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ,ఇక్కడ వ్యవసాయ భూములు లేకపోయినా రెవెన్యూ అధికారులు ఈ భూములపై గతంలో వ్యవసాయ భూములుగా పాస్బుక్లు జారీ చేశారని తెలుస్తున్నప్పటికీ కలెక్టర్కి పంపిన నివేదికలో మాత్రం ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తుంది.
తహసిల్దార్తో కలసి రిపోర్ట్ మానిప్యులేషన్?
ప్రజల ఫిర్యాదు అందిన ఆరు రోజుల తరువాత మండల తహసిల్దార్ సలహాతో జూనియర్ అసిస్టెంట్ కోలా బేబీ తన పాస్బుక్లో సర్వే నంబర్ 256/81లో 0.11 కుంటలు తప్పుగా నమోదు అయ్యాయని, EPPB నుండి ఆ సర్వే నెంబర్లను తొలగించాలని తహసిల్దార్కి ఒక దరఖాస్తు ఇచ్చినట్లు, తన వద్ద ఉన్న మరో అసైన్మెంట్ భూమి సర్వే నంబర్ 261/ఇ2 లో 0.11 కుంటలు చట్ట విరుద్ధంగా పొందిన వివరాలను విచారణలో పేర్కొనకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో అనే చర్చనీయాంశంగా మారింది.
ఈమె గత ఏడు సంవత్సరాలుగా అక్రమ పాస్బుక్ ఆధారంగా రైతు బంధు, రుణమాఫీ వంటి పథకాల ద్వారా లబ్ధి పొందుతూ, ఇప్పుడు తన పేరుపై తప్పుడు సర్వే నంబర్లతో వచ్చిన EPPB తొలగించాలంటూ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఒక కల్పిత ఫిర్యాదు చేసి తనను తన భర్తను కాపాడుకునే ప్రయత్నం చేసిందనీ ప్రజల ఆరోపణ.
ప్రజల ఆగ్రహం
తహసిల్దార్ మరియు రెవెన్యూ సిబ్బంది తమ సాటి ఉద్యోగి కోలా బేబీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనీ, ఒక ఉద్యోగి తప్పులను సాటి ఉద్యోగులు కప్పిపుచ్చుకుంటే సాధారణ ప్రజలకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది?” అని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.
డిమాండ్
తప్పుడు రిపోర్ట్ సమర్పించిన మండల తహసిల్దార్పై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా పాస్బుక్లు పొందిన జూనియర్ అసిస్టెంట్ బేబీ మరియు ఆమె భర్తపై పూర్తి స్థాయి విచారణ జరిపి ఉద్యోగం నుండి తొలగించడంతో పాటు (డిస్మిస్), వారి దగ్గర ఉన్న EPPBలను రద్దు చేయాలని,
అలాగే ప్రభుత్వ పథకాల (రైతు బంధు, రుణమాఫీ) నిధులను దుర్వినియోగం చేసినందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ను ప్రజలు కోరుతున్నారు.
ఈ మొత్తం ఘటనలో రెవెన్యూ వ్యవస్థలోని లోపాలు, అధికారుల నిర్లక్ష్యం, మరియు అధికార దుర్వినియోగం స్పష్టంగా బయటపడుతున్నాయి. ప్రజా భూముల పరిరక్షణ బాధ్యత ఉన్నవారే అవినీతి ముసుగులో వ్యవస్థను మోసం చేయడం ఆందోళన కలిగించే అంశం. న్యాయం కోసం సాధారణ ప్రజలు పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడటం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం. ఈ కేసు పూర్తి స్థాయి విచారణతో పాటు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ప్రజల్లో నమ్మకం తిరిగి నెలకొనే అవకాశం ఉంటుంది.
Also Raed: Hrithik Roshan: ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకుండా.. ‘వార్ 2’ రిజల్ట్పై హృతిక్ రోషన్ షాకింగ్ పోస్ట్!
