Viral Video: భూమిపై జీవించే అతి ప్రమాదకరమైన జీవుల్లో మెుసలి ఒకటి. అయితే ఎప్పుడు నీటిలోనే ఉండే మెుసలి (Crocodile).. అప్పుడప్పుడు ఇళ్ల మధ్యకు వచ్చిన ఘటనలు గతంలో చూశాం. ఈ క్రమంలోని యూపీలోని షాజహాన్ పూర్ లో ఓ మెుసలి.. ఊర్లోకి ప్రవేశించి హల్ చల్ చేసింది. దీంతో స్థానికులు ఎంతో సాహసోపేతంగా ప్రవర్తించి.. మెుసలిని కట్టడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అసలేం జరిగిందంటే..
షాజహాన్ పూర్ (Shahjahanpur) మెుహల్లా గడియానా (Mohalla Gadiyana) గ్రామంలోని సింగ్ పెట్రోల్ పంప్ వద్ద ఆదివారం (ఆగస్టు 4) ఈ ఘటన చోటుచేసుకుంది. తాజాగా ఫొటోలు బయటకు రావడంతో నెటిజన్ల దృష్టి దీనిపై పడింది. వివరాల్లోకి వెళ్తే.. సింగ్ పెట్రోల్ బంక్ కు ఆనుకొని ఉన్న పక్క గల్లీలో తొలుత ఈ మెుసలి కనిపించింది. మెుసలిని గమనించిన వీధి కుక్కలు ఒక్కసారిగా మెురగడం ప్రారంభించాయి. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన స్థానికులు.. మెుసలిని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. గంగానదికి అనుసంధానమైన పెద్ద డ్రెయిన్ ద్వారా మెుసలి వచ్చి ఉండొచ్చని అనుమానించారు.
2 గంటలు శ్రమించి.. కారులో బంధించి
మెుసలిని చూసిన వెంటనే గ్రామస్తులు అలారం మోగిస్తూ మిగతావారిని అలర్ట్ చేశారు. అర్ధరాత్రి 2 గంటలు కావొస్తుండటంతో ఫారెస్ట్ అధికారులు ఎవరూ ఉండరని భావించి.. తామే ఆ మెుసలిని బంధించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సుమారు 2 గంటల పాటు శ్రమించి.. తాళ్ల సాయంతో మెుసలిని పట్టుకున్నారు. అనంతరం అది పారిపోకుండా కారులో బంధించి.. ఊరికి దూరంగా హయత్ పురాకు కారును తీసుకెళ్లి అక్కడ నిలిపివేశారు. దీంతో రాత్రంతా మెుసలి కారులోనే చిక్కుకొని ఉండిపోయింది.
Also Read: UP Crime: ప్రియుడితో ఎఫైర్.. భర్తను కత్తితో పొడిచి.. యాసిడ్ పోసి భార్య హత్య!
➡️#शाहजहांपुर में गदियाना मोहल्ले में सड़क पर घूमते घूमते मगरमच्छ एक कार में घुस गया।
➡️स्थानीय लोगों ने बड़ी मुश्किल से मगरमच्छ को पकड़ा और वन विभाग की टीम को सुरक्षित सौंप दिया। pic.twitter.com/BO6JFPLBeN— AIR News Lucknow (@airnews_lucknow) August 4, 2025
రంగంలోకి ఫారెస్ట్ అధికారులు
మెుసలి గురించి సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు.. సోమవారం ఉదయం రంగంలోకి దిగారు. ఉదయం 9:30 ప్రాంతంలో కారు ఉన్న ప్రాంతానికి చేరుకొని మెుసలిని తాము తీసుకొచ్చిన పంజరంలోకి మార్చారు. అయితే ఈ మెుసలి గర్రా నది నుంచి సమీప పొలాల గుండా డ్రెయిన్ లోకి ప్రవేశించి ఉండొచ్చని ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. అక్కడి నుంచి ఊర్లోకి వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. మెుసలిని తిరిగి సురక్షిత ప్రాంతంలో విడిచి పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.