Upasana: హెల్త్ కేర్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న ఫ్యూజీఫిల్మ్ ఇండియా సంస్థ తాజాగా ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే సీఎస్ఆర్ ప్రచారాన్ని ప్రారంభించింది. అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ ఛైర్పర్సన్ ఉపాసనా కామినేని కొణిదెల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించి, దాన్ని త్వరగా గుర్తించాల్సిన అవసరంపై ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై కొన్ని అపోహలు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రచారం ముమ్మరం చేయనున్నారు. దేశంలోని 24 నగరాల్లో ఈ ప్రచారం ఉండబోతుంది. ఇది మొత్తం 1.5 లక్షల మంది మహిళలను టార్గెట్ చేసుకుని ఉంటుందని, నిర్మాణాత్మక సమాజ భాగస్వామ్యం, ఆరోగ్య ముప్పు అంచనాలతో శిక్షణ పొందిన క్షేత్రస్థాయి సిబ్బంది ఆధ్వర్యంలో ఇది కొనసాగుతుందని కార్యక్రమ నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అపోలో ఫౌండేషన్ అమలు చేయనుంది.
Also Read- Thammudu Trailer: మాటపోయి మనిషి బతికినా మనిషిపోయినట్టే లెక్క.. అదే మనిషి పోయి మాట బతికితే..!
భారతీయ మహిళల్లో చాలా ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. ఐసీఎంఆర్ వారి జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ అంచనాల ప్రకారం, మహిళలకు వచ్చే మొత్తం క్యాన్సర్లలో 14 శాతం ఇదే ఉంటోంది. ప్రతి 29 మంది మహిళల్లో ఒకరికి జీవితకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దురదృష్టవశాత్తు, తగినంత అవగాహన లేకపోవడం, అపోహలు, సరైన వైద్య సదుపాయం అందుబాటులో లేకపోవడంతో చాలా కేసులు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ సవాళ్లను అధిగమించేందుకే ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే ఈ కార్యక్రమాన్ని వారు చేపట్టారు. స్థానిక స్థాయిలో నమ్మదగిన, సాంస్కృతికంగా సున్నితమైన సమాచారాన్ని అందించేలా ఈ కార్యక్రమం ఉంటుంది. గౌరవప్రదమైన బహిరంగ చర్చలు, వర్క్షాప్లు, అవగాహన సదస్సులు నిర్వహించి.. మహిళలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించేలా, తద్వారా వారు తమ లక్షణాలను త్వరగా గుర్తించి, స్వీయ పరీక్షల ద్వారా అర్థం చేసుకుని, సరైన సమయానికి చికిత్సలు పొందేలా ఈ కార్యక్రమ యాక్షన్ ప్లాన్ ఉంటుందని ఫ్యూజీఫిల్మ్ ఇండియా సంస్థ తెలుపుతుంది.
Also Read- Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ.. ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు!
ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ ఛైర్పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల మాట్లాడుతూ.. మహిళలు, ఆరోగ్యం, మార్పు కోసం మా వెంట నిలబడ్డ అందరికీ థ్యాంక్యూ. మహిళలు భయపడకుండా, గౌరవంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక. ఈ రోజు మనం ఒక ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. టెక్నాలజీని సాధారణ మహిళల జీవితాల్లోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఆరోగ్య వ్యవస్థను ఒక ఉద్యమంగా మార్చే మొదటి అడుగు ఇదని నేను భావిస్తున్నాను. భారత్లో ప్రతి 4 నిమిషాలకు ఒక మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతోంది. ప్రతి 13 నిమిషాలకు ఒక మహిళ ఈ కారణంగా ప్రాణాలు కోల్పోతుంది. భారత మహిళల్లో 50 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ లేటు స్టేజ్లో గుర్తించబడుతుంది. ఇది ముఖ్యంగా స్క్రీనింగ్ తగిన సేవలు లేని సముదాయాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ద్వారా ట్రైన్డ్ హెల్త్కేర్ వర్కర్స్ ఇప్పుడు నేరుగా మహిళల వద్దకు వెళ్లనున్నారు. నిర్మాణ ప్రాంతాలు, పట్టణాల శివార్లలోని బస్తీలు, తక్కువ ఆదాయం గల కుటుంబాల వద్దకు వెళ్లి మరీ సేవలు అందించనున్నారు. దేశంలో 24 రాష్ట్రాల్లో దాదాపు 1.5 లక్షల మహిళలకు ఈ సేవలు అందనున్నాయి. తమిళనాడు అరగొండలోని పైలెట్ ప్రోగ్రామ్ ద్వారా అనేక మహిళలకు సేవలు అందించగలిగాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా 150 ప్రాణాలు కాపాడగలిగాం. ఇది చారిటీ కాదు, మా బాధ్యత. సెల్ఫ్ ఎగ్జామ్స్ అనేది చెడుగా భావించాల్సినవి కాదు. మనం బ్లడ్ షుగర్ గురించి ఎంత సాధారణంగా మాట్లాడగలుగుతున్నామో.. అలాగే బ్రెస్ట్ హెల్త్ గురించీ మాట్లాడాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి. డాక్టర్లు, జర్నలిస్టులు, ఇన్ఫ్లూయెన్సర్లు, కమ్యూనిటీ లీడర్లు.. మీ అనుభవాలను షేర్ చేయండి. ఇప్పటి నుంచైనా ఒక మార్పు ప్రారంభం కావాలి. అపోలో ఫౌండేషన్లో పని చేయడం, నాకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. దయచేసి మహిళలు ముందుగా స్క్రీనింగ్ చేయించుకునేలా ప్రోత్సహించండని కోరారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు