Girls At Wines: ఎంచక్కా స్కూల్కి వెళ్లి, బుద్ధిగా చదువుకోవాల్సిన పిల్లలు.. ఏమాత్రం భయంభక్తి లేకుండా వైన్స్ షాపుకి వెళ్లి మద్యం కొనుగోలు చేస్తే ఎంత షాకింగ్గా అనిపిస్తుందో ఊహించుకోండి ఒకసారి. ఊహకే భయంకరంగా అనిపిస్తున్న ఈ ఘటన మధ్యప్రదేశ్లో నిజంగానే జరిగింది. ఇద్దరు ఆడ పిల్లలు.. అందులోనూ యూనిఫామ్లో వైన్స్కి వెళ్లి కొనుగోలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు వైరల్గా మారడంతో అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. మండ్లా జిల్లా నైన్పూర్ టౌన్లో ఈ ఘటన జరిగింది. స్కూల్ యూనిఫాంలో ఉన్న విద్యార్థినులు ప్రభుత్వ మద్యం షాపులో ఆల్కహాల్ కొన్నారు.
స్కూల్ యూనిఫాంలో, తలకు స్కార్ఫ్లు పాక్షికంగా కప్పుకున్న బాలికలు దర్జాగా నడుచుకుంటూ మద్యం షాపులోకి వెళ్లారు. ఒకరు కౌంటర్ వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేయగా, ఒకరు కాస్త దూరంగా నిలబడ్డారు. కొనడం అయిపోయిన తర్వాత ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మద్యం విక్రయించే వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించి బాలికలకు మద్యాన్ని విక్రయించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ వైరల్గా మారింది. ఈ ఘటన స్థానిక అధికారులను ఇబ్బందుల్లోకి నెట్టింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు, సామాజిక అవగాహనపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో, వీడియో వైరల్ అయిన కొన్ని గంటల్లోనే సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) ఆశుతోష్ ఠాకూర్ రంగంలోకి దిగారు. స్థానిక తహసీల్దార్, పోలీసులను వెంటబెట్టుకొని వైన్షాపుకి వెళ్లారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Read Also- Seethakka: ఏడాదిన్నరలోనే 80 వేల కొలువులు ఇచ్చాం.. పదేళ్ల నిరీక్షణకు ఇప్పుడు ఫలితం : మంత్రి సీతక్క
సీసీటీవీ ఫుటేజీని జాగ్రత్తగా పరిశీలించిన అధికారులు మైనర్లకు మద్యం విక్రయించినట్టుగా ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. జనరల్ లైసెన్స్ కండిషన్స్ (GLC) ఉల్లంఘించడమే స్పష్టం చేశారు. మద్యం చట్టాల ప్రకారం క్రిమినల్ నేరం కిందకు వస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం వైన్ షాపు యజమానిని ప్రశ్నిస్తున్నారు. బాలికలు వారంతట వారే కొన్నారా?, లేక ఎవరైనా పంపించారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ పూర్తిస్థాయి విచారణ పూర్తయిన తర్వాత రిపోర్టును జిల్లా కలెక్టర్కు సమర్పించనున్నారు.
రిపోర్ట్ అందిన తర్వాత పరిశీలించిన అనంతరం మద్యం దుకాణం లైసెన్స్ను రద్దు చేస్తారని, జరిమానా కూడా విధిస్తామని అధికారులు తెలిపారు. మైనర్లకు మద్యం విక్రయించిన ఉద్యోగిని కూడా తొలగిస్తారని జిల్లా ఎక్సైజ్ అధికారి రామ్జీ పాండే తెలిపారు. మైనర్లకు మద్యం అమ్మడం లైసెన్స్ నిబంధనలను తీవ్ర ఉల్లంఘన కిందకు వస్తుందని ఆయన వివరించారు. ఈ షాకింగ్ ఘటన మండ్లా జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మైనర్లకు మద్యం విక్రయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుకాణ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also- WhatsApp Fraud: వాట్సప్లో ఇలాంటి మెసేజులు వస్తున్నాయ్.. జరజాగ్రత్త.. సజ్జనార్ కీలక సూచన
ఈ వివాదం వెంటనే రాజకీయ రంగును కూడా పులుముకుంది. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మధ్యప్రదేశ్లో మద్యపానం పెరిగిపోతోందంటూ కేంద్ర ప్రభుత్వ నివేదిక గురించి మాట్లాడితేని తన దిష్టి బొమ్మలు తగలబెట్టారని, మరి ఇప్పుడు స్కూల్ బాలికలు నేరుగా మద్యం కొనుగోలు చేస్తుంటే, ఆ నాయకులు, వారి ‘మహిళా శక్తి’ ఎక్కడ ఉందని ఆయన నిలదీశారు.
