King Mswati: పూర్వకాలంలో పలువురు రాజులు బహుభార్యత్వాన్ని కొనసాగించారు. ఆ కాలంలో కూడా ఇద్దరు, ముగ్గురు, మహాఅయితే నలుగురు సతీమణులు ఉండేవారమో. కానీ, దక్షిణ ఆఫ్రికా ఖండంలో ఉండే ఈస్వాటినీ దేశ రాజు మ్స్వాతి-3కి (King Mswati) ఏకంగా 15 మంది భార్యలు ఉన్నారు. దేశాధినేతలు విదేశీ పర్యటనల్లో తమ భార్యలను వెంటబెట్టుకొని వెళ్లడం ఆనవాయితీ. ఆ సంప్రదాయాన్ని తూ.చ.తప్పకుండా పాటించిన మ్స్వాతి-3 ఏకంగా 15 మంది భార్యలను తీసుకొని అబూదాబీ పర్యటనకు వెళ్లారు. భార్యలతో పాటు వీరందరికీ సేవలు అందించేందుకు మరో 100 మంది సర్వెంట్లను కూడా వెంట తీసుకెళ్లారు. అంతా కలిసి అబుదాబి పర్యటనకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన పాత వీడియో ఒకటి మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిజానికి, ఈ వీడియో ఈ ఏడాది జూలైలో బయటకొచ్చింది. రాజు తన అనేకమంది భార్యలు, భారీ బృందంతో అబూదాబీ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన దృశ్యాలు చకర్లు కొట్టాయి.
ఆ వీడియోలో రాజు మ్స్వాతి-3 ఒక ప్రైవేట్ జెట్ నుంచి కిందకు దిగారు. సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఆయన వెనుకాలే గౌరవప్రదమైన దుస్తుల్లో 15 మంది మహిళలు (భార్య) కిందకు దిగారు. భార్యలే కాదు, ఆయన 30 మంది పిల్లలు కూడా ఈ ప్రత్యేక విమానంలో అబుదాబి వచ్చారట. రాజు బృందం భారీగా ఉన్న కారణంగా ఎయిర్పోర్టులో తాత్కాలిక అవాంతరాలు కూడా ఎదురయ్యాయి. ఈ బృందానికి పకడ్బందీగా స్వాగతించేందుకుగానూ ఎయిర్పోర్టులో కొన్ని టెర్మినల్స్ను తాత్కాలికంగా మూసివేసినట్టుగా పలు కథనాలు పేర్కొన్నాయి.
తండ్రికి 125 మంది భార్యలు
ఈస్వాటినీ దేశాన్ని స్వాజిలాండ్ అని కూడా పిలుస్తారు. మ్స్వాతి-3 రాజుకు 15 మంది భార్యలు ఉండగా, ఆయన తండ్రి సొభుజా-2కి ఏకంగా 125 మంది భార్యలు ఉన్నారంటూ వీడియో క్యాప్షన్లో రాసుకొచ్చారు. అయితే, ఈ వీడియో వైరల్ కావడంతో రాజు మ్స్వాతి-3పై విమర్శలు వెల్లువెత్తాయి. ఒక నెటిజన్ స్పందిస్తూ, ‘‘ఆయనేమో ప్రైవేట్ జెట్లో తిరుగుతున్నాడు. కానీ, అక్కడి ప్రజలకు కరెంటు కూడా లేదు’’ అని మండిపడ్డారు. మరో యూజర్ స్పందిస్తూ, ‘‘ఇది అంత ధనిక దేశమా?. ప్రైవేట్ జెట్ కొనగలిగే స్థితిలో ఉందా?’’ అని సందేహం వ్యక్తం చేశారు. మరో నెటిజన్ స్పందిస్తూ, ‘‘ఇతగాడు ప్రైవేట్ జెట్లలో తిరుగుతుంటే, ఆయన ప్రజలు మాత్రం ఆకలితో అలమటించిపోతున్నారు’’ అని వాస్తవ పరిస్థితిని ప్రస్తావించాడు. మరొకరు స్పందిస్తూ, ‘‘ఆఫ్రికాలో పిల్లల్ని పోషించడానికి డబ్బు సాయం కావాలని చెప్పే వాళ్లు వీళ్లనా?’’ అని నిలదీశాడు. ‘‘ఇంతమంది భార్యలను మెయింటెయిన్ చేయడానికి ఎవరైనా కోఆర్డినేటర్ ఉన్నారా?’’ అంటూ హస్యపూరితంగా కామెంట్ చేశాడు.
Read Also- Seethakka: పదేళ్లలో తెలంగాణను అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్.. సీతక్క కీలక వ్యాఖ్యలు
రాజు ఆస్తి రూ.8 వేల కోట్లు పైమాటే!
ఆఫ్రికాలో చిట్టచివరి అధికార రాజుగా గుర్తింపు పొందిన మ్స్వాతి-3…. 1986 నుంచి దక్షిణ ఆఫ్రికాలోని చిన్న దేశమైన ఈస్వాటినీ పాలిస్తున్నారు. పలు నివేదికల ప్రకారం, ఆయన వ్యక్తిగత సంపద 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారుగా రూ. 8,000 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈస్వాటీనీ రాజ్యంలో వైద్య, విద్యా రంగాలు పూర్తిగా కుప్పకూలిపోయిన స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత ఉంది. యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఆర్థిక సమస్యలతో మధ్యలోనే మానేస్తున్నారు. విద్యార్థులు విరాళాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం, 2021 నాటికి ఆ దేశంలో నిరుద్యోగ రేటు 23 శాతం నుంచి 33.3 శాతానికి ఎగబాకింది. ధరల పెరుగుదల, ఆర్థిక అసమానతలు అక్కడ విలయతాండవం చేస్తున్నాయి. దేశం సంగతి పక్కనపెడితే.. మ్స్వాతి-3 నిర్మాణ, పర్యాటకం, వ్యవసాయం, టెలికమ్యూనికేషన్లు, అటవీ పరిశ్రమలలో పెద్ద ఎత్తున షేర్లను కలిగి ఉన్నారని స్వాజిలాండ్ న్యూస్ రిపోర్ట్ కథనం పేర్కొంది. రాజ కుటుంబం అపార ధనసంపదను అనుభవిస్తున్నప్పటికీ, సాధారణ ప్రజల జీవితం పూర్తిగా భిన్నంగా ఉంది. ఈస్వాటినీలో దాదాపు 60 శాతం మంది ప్రజలు పేదరిక రేఖకు దిగువన జీవిస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి.
