Viral News: మెట్టినింటి వారి చేతిలో ఓ మహిళ దారుణ హత్యకు గురయింది. కోడలి ప్రాణాలు తీసేసి ఏమీ తెలియనట్టుగా నిందితులు పెద్ద నాటకం ఆడారు. కానీ, పాపం పండి వ్యవహారం మొత్తం బయటపడింది. హర్యానాలోని ఫరీదాబాద్లో సంచలన హత్య (Viral News) వెలుగుచూసింది. అత్తింటివారు కోడలిని హత్య చేసి ఇంటికి ఆనుకొని ఉన్న వీధిలో 10 అడుగుల గుంత తవ్వి శవాన్ని పూడ్చిపెట్టారు. దానిపై కాంక్రీట్ పోశారు. అయితే, వ్యవహారం బయటపడడంతో శనివారం ఉదయం పోలీసులు గుంతను తవ్వి కుళ్లిపోయిన మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం పంపించారు.
ఫిర్యాదు అందడంతో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. మృతురాలు తనూ (Tanu) హత్యకు గురైందనితేల్చారు. భర్త అరుణ్, అత్తమామ, మరో దగ్గరి బంధువు నలుగురూ కలిసి హత్య చేశారని చెప్పారు. అనంతరం మృతదేహాన్ని ఇంటి పక్కనే ఉన్న వీధిలో గొయ్యి తవ్వి మృతదేహాన్ని పూడ్చి పెట్టారని నిర్ధారించారు. మురుగునీరు సరిగా పోవడం లేదంటూ గుంత తవ్వారని, ఏప్రిల్ నెలలో ఈ వ్యవహారం జరిగిందని ఇరుగుపొరుగు వారు పోలీసులకు చెప్పారు. గుంత తవ్విన నాటి నుంచి తనూ కనిపించలేదని, ఏదో అనుమానాస్పదంగా అనిపించిందని, అయితే, ఇంతఘోరం చేస్తారని ఊహించలేదని స్థానికులు నిర్ఘాంతపోయారు. శనివారం ఉదయం 8 గంటల సమయంలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. మృతికి ఖచ్చితమైన కారణం, హత్య జరిగిన సమయాన్ని నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ పరీక్ష కోసం డెడ్బాడీని పంపించారు. తనూ భర్త, అత్తమామలతో పాటు ఒక దగ్గరి బంధువుని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. తనూ వయసు 24 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్లోని షికోహాబాద్కు చెందిన ఆమెకు, ఫరీదాబాద్లోని రోషన్ నగర్కు చెందిన అరుణ్ అనే యువకుడితో రెండేళ్ల క్రితమే పెళ్లి జరిగింది.
Read this- AirIndia-DGCA: ఎయిరిండియాకు డీజీసీఏ సంచలన ఆదేశాలు
అసలు ఏం జరిగిందంటే?
పెళ్లైన నాటి నుంచి అత్తింటివారు కట్నంగా బంగారు నగలు, డబ్బు కోసం తనూని మానసికంగా, శారీరకంగా వేధించారని మృతురాలి సోదరి ప్రీతి వెల్లడించింది. వాళ్లు అడిగిన వాటిని పెట్టేందుకు తన కుటుంబం వీలైనంత వరకు ప్రయత్నించిందని, అయినప్పటికీ వారి డిమాండ్లు ఆగలేదని, పదే పదే ఒత్తిడి తీసుకొచ్చారని వాపోయింది. వివాహం జరిగిన నాటి నుంచి అరుణ్, అతడి తల్లిదండ్రులు భారీగా డబ్బు డిమాండ్ చేశారని ప్రీతి పేర్కొంది. ‘‘తనూ పెళ్లైన కొన్ని నెలలకే మా ఇంటికి వచ్చేసింది. అమ్మానాన్నలతో కలిసి ఇంట్లోనే ఉంది. అత్తింటివారు ఆమెను మంచిగా చూసుకోకపోవడమే ఇందుకు కారణం. ఒక ఏడాదితో పాటు మాతోనే ఉంది. చివరికు మేము సర్దిచెప్పి సంసారానికి పంపించాం. మళ్లీ హింసించడం మొదలుపెట్టారు. తనూని మాతో మాట్లాడనివ్వకుండా చేశారు. ఫోన్ కాల్స్ కూడా మాట్లాడనివ్వలేదు. తనూ ఇంటి నుంచి పారిపోయిందని ఆమె అత్తమామలు ఏప్రిల్ 23న మా కుటుంబ సభ్యులకు చెప్పారు. అంతకుముందు ఏప్రిల్ 9న ఫోన్ చేస్తే కలవకపోవడంతో అనుమానం వచ్చింది. పారిపోయిందని చెప్పడంతో అనుమానం బాగా బలపడింది. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు వారంపాటు పెద్దగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అని ప్రీతి వివరించింది.
Read this- Special Railway Stations: దేశంలో టాప్-7 రైల్వే స్టేషన్లు.. వీటి ప్రత్యేకతలు తెలిస్తే మతిపోవాల్సిందే!
గొయ్యి తీసిన మామ
ఇంటికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదంటూ ఏప్రిల్లో మృతురాలు తనూ మామయ్య ఈ గొయ్యిని తవ్వారని పోలీసులు ధృవీకరించారు. గొయ్యి తవ్విన వెంటనే పూడ్చివేశారని, దానిపై కాంక్రీట్ పోసి స్లాబ్ మాదిరిగా ధృడంగా ఉండేలా చేశారని స్థానికులు చెప్పారు. ‘‘గొయ్యి తవ్వేటప్పుడు ఇరుగుపొరుగు వారందరూ చూశారు. ఎందుకోసమని అడిగితే, మురికి నీటి కోసం అని తనూ మామయ్య చెప్పారు. ఆ తర్వాత, తనూ ఎప్పుడూ కనిపించలేదు. ఏదో తప్పు జరుగుతోందని కొందరు అనుమానించారు. కానీ, ఇంత దారుణానికి పాల్పడతారని ఎవరూ ఊహించలేదు’’ అని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) ఉషా కుండు మాట్లాడారు. ఈ ఘటనపై వారం కిందట అధికారిక ఫిర్యాదు అందిందని చెప్పారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారని, గుంత నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితులు నలుగురినీ అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.