Bank Loan News: భారీ వడ్డీకి అప్పులు, లేదా రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించకపోతే ఎంత దారుణమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో హెచ్చరించే షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సింగపూర్కు చెందిన ఓ వ్యక్తి 2010లో 250,000 సింగపూర్ డాలర్లు, అంటే, భారతీయ కరెన్సీలో సుమారుగా రూ.1.75 కోట్ల లోన్ తీసుకున్నాడు. ప్రభుత్వ గుర్తింపు లైసెన్స్ ఉన్న వడ్డీ వ్యాపార సంస్థ నుంచి ఈ పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నాడు. అయితే, సకాలంలో చెల్లించకపోవడంతో కేవలం 11 ఏళ్లలో ఏకంగా 21 మిలియన్ సింగపూర్ డాలర్లకు పెరిగింది. భారతీయ కరెన్సీలో చూస్తే ఏకంగా రూ.147 కోట్లకు చేరింది.
అధికమైన వడ్డీ, సకాలంలో చెల్లించకపోవడం ఇందుకు కారణాలయ్యాయి. దీంతో, ఈ లోన్ చెల్లించేందుకు సదరు రుణగ్రహీత తన ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది. అది కూడా తనకు రుణం ఇచ్చిన సంస్థ డైరెక్టర్కు ఈ ఇంటిని అమ్మేశాడు. మరో ట్విస్ట్ ఏంటంటే, అదే అద్దె చెల్లిస్తూ అదే ఇంట్లో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. నెలకు 7,000 – 8,000 సింగపూర్ డాలర్ల అద్దెగా చెల్లిస్తున్నానని వివరించాడు. ఈ విషయం ఇప్పుడెందుకు తెరపైకి వచ్చిందంటే, తనకు అన్యాయం జరిగిందంటూ లోన్ తీసుకున్న వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. రుణం ఇచ్చిన సంస్థ డైరెక్టర్ తన ఇంటిని కొనుగోలు చేసి, ఇంటి నుంచి బయటకు గెంటేశాడని పిటిషన్లో పేర్కొన్నాడు.
Read Also- iPhone 16: భారత వినియోగదారుల ఫేవరెట్గా ఐఫోన్ 16.. అమ్మకాలలో అగ్రస్థానం
వడ్డీ నెలకు 4 శాతం
ఈ లోన్పై సదరు రుణ సంస్థ భారీ వడ్డీ రేటు విధించింది. సాధారణంగా ఏడాది చొప్పున వడ్డీ రేట్లు ఉంటాయి. బాధిత వ్యక్తి తీసుకున్న రుణంపై నెలకు ఏకంగా 4 శాతం వడ్డీ విధించింది. అంతేకాదు, ఆలస్యంగా చెల్లిస్తే, నెలకు అదే వడ్డీ రేటు 8 శాతంగా చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ పెరగడమే కాదు, లేట్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజు కింద నెలకు 2,500 సింగపూర్ డాలర్లు చొప్పున విధించారు. దీంతో, కేవలం నాలుగేళ్లలోనే చెల్లించాల్సిన లోన్ మొత్తం అతడి చేతుల్లో లేకుండా పోయింది. చక్రవడ్డీ, ఛార్జీల కారణంగా నాలుగేళ్లలోనే 3 మిలియన్ సింగపూర్ డాలర్లకు అప్పు పెరిగింది.
చెల్లింపులో తీవ్ర ఇబ్బందుల కారణంగా 2016లో తన ఇంటిని కూడా రుణగ్రహీత విక్రయించుకున్నాడు. రుణం ఇచ్చిన సంస్థ డైరెక్టర్కి 2.1 మిలియన్ సింగపూర్ డాలర్లకు విక్రయించాడు. భారతీయ కరెన్సీలో ఈ విలువ రూ.14 కోట్లుగా ఉంది. అయినప్పటికీ అప్పు తీరలేదు. ఇక, ఇదే సమయంలో ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తితో రెంటల్ అగ్రిమెంట్ చేసుకొని, సొంత ఇంటిలో అద్దెకు నివసించడం మొదలుపెట్టాడు. ఒక పక్క అప్పు పెరుగుతూనే వచ్చింది. ఈ విధంగా 2021 నాటికి అతడి రుణం మొత్తం 21 మిలియన్ సింగపూర్ డాలర్లకు, అంటే రూ.147 కోట్లకు పెరిగిపోయింది.
కాగా, సదరు రుణ సంస్థ విధించిన వడ్డీ రేట్లు, ఫీజులతో పాటు ఇంటి కొనుగోలు విషయంలో కుదుర్చుకున్న రెంటల్ అగ్రిమెంట్ విషయంలో చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘనపై కోర్టు పరిశీలన చేస్తోంది. భారీ వడ్డీ కావడంతో ఇందుకు ఆస్కారం ఉంటుందా?, చట్టాలు ఏం చెబుతున్నాయి? అనే అంశాలను న్యాయమూర్తులు పరిశీలిస్తున్నారు. వివరాలన్నీ పరిశీలించిన తర్వాత ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Read Also- Khammam Police: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదికను విడుదల చేసిన కమీషనర్ సునీల్ దత్!

