Dukes Ball: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ టెస్ట్ సిరీస్లో డ్యూక్స్ బాల్ (Dukes ball) ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ బాల్స్ నాణ్యతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ అందరి కంటే ముందుగా బాల్ క్వాలిటీపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బంతి త్వరగా గట్టితనాన్ని కోల్పోతోందని, తేలికగా మృదువుగా మారుతోందని గిల్ మండిపడ్డాడు. బంతి నాణ్యత కారణంగా ఈ సిరీస్లో ఇప్పటికే ఇరు జట్లు పలుమార్లు మార్చాల్సి వచ్చింది. ఈ సమస్యను ప్లేయర్లు నేరుగా అంపైర్ల దృష్టికి తీసుకెళ్లారు.
అయితే, బంతి నాణ్యతపై ఆరోపణల వ్యక్తమవుతుండడంపై ‘డ్యూక్స్ బాల్స్’ తయారీ కంపెనీ ‘బ్రిటిష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్’ స్పందించింది. బంతి నాణ్యతను పరిశీలిస్తామని, అవసరమైతే మార్పులు చేస్తామని కంపెనీ యజమాని దిలీప్ జాజోడియా ప్రకటించారు. ‘‘మేము బాల్ని సమగ్రంగా పరిశీలిస్తాం. చర్మం ప్రాసెస్ చేసే కంపెనీ తన్నర్తో పాటు బంతి తయారీలో ఉపయోగించే ఇతర ముడి పదార్థాలన్నింటిపై చర్చిస్తాం. అవసరమైతే ప్రతి అంశాన్ని పునఃపరిశీలించి, మార్పులు చేస్తాం’’ అని బీబీసీ స్పోర్ట్ ఛానల్తో జాజోడియా అన్నారు.
శుభ్మన్ గిల్ ఏమన్నాడు?
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో విజయం సాధించిన అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మీడియాతో మాట్లాడాడు. ‘‘బంతి గట్టిదనాన్ని కోల్పోవడం బౌలర్లకు చాలా సంక్లిష్టంగా మారుతుంది. పిచ్ కన్నా బంతి త్వరగా రూపాన్ని కోల్పోవడం నిజంగా పెద్ద సమస్య. బంతి చాలా త్వరగా మెత్తగా తయారవుతోంది. పిచ్లో కాదు, బాల్లోనే సమస్య ఉందని అనిపిస్తోంది. ఇలా ఉంటే వికెట్లు తీయడం చాలా కష్టం’’ అని గిల్ వ్యాఖ్యానించాడు.
Read Also- Water Rocket: వాటర్ రాకెట్ తయారు చేసిన చైనా విద్యార్థులు.. వీడియో ఇదిగో
కాగా, డ్యూక్స్ బాల్స్కు గతంలో అత్యుత్తమ గుర్తింపు ఉండేది. అయితే, ఈ మధ్యకాలంలో ఇదే కంపెనీకి చెందిన బంతుల నాణ్యతపై టెస్ట్లు, కౌంటీ క్రికెట్లో కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి బంతిని 80 ఓవర్ల పాటు ఉపయోగించాల్సి ఉన్నప్పటికీ, చాలా ముందుగానే మెత్తగా తయారవుతున్నాయి. దీంతో బౌలర్లు వికెట్లు తీయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాగా, 5 ‘అండర్సన్-టెండూల్కర్’ ట్రోఫీలో మూడు మ్యాచ్లు పూర్తవ్వగా, ఆతిథ్య జట్టు 2, టీమిండియా (Team India) ఒక విజయాలు సాధించాయి. 2-1 తేడాతో ఇంగ్లండ్ ముందంజలో ఉంది. మిగిలివున్న రెండు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ ఒక్క విజయం సాధించినా సిరీస్ను గెలుచుకుంటుంది. అందుకే, ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న మూడవ మ్యాచ్కు అత్యంత పకడ్బందీగా బరిలోకి దిగాలని టీమిండియా కృతనిశ్చయంతో ఉంది. మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని నిర్ణయించుకుంది. అందుకే, కీలక మార్పులతో టీమిండియా బరిలోకి దిగనుంది.
Read Also- AK-203: ఆర్మీ చేతికి కొత్త ఆయుధం.. నిమిషానికి 700 బుల్లెట్లు
ఉత్కంఠభరితంగా సాగిన లార్డ్స్ టెస్టులో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా ఓటమిపాలైంది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. రవీంద్ర జడేజా, నితిష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్రౌండర్లు ఉన్నప్పటికీ బ్యాటింగ్లో విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ భారత జట్టు మేనేజ్మెంట్కు ఒక కీలక సూచన చేశాడు. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.