ICC CLT: భారత్లో ఐపీఎల్ మాదిరిగా, వేర్వేరు దేశాల ఫ్రాంచైజీ లేదా క్లబ్ జట్ల మధ్య నిర్వహించే అంతర్జాతీయ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ‘ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20’ (Champions League Twenty20) త్వరలోనే తిరిగి క్రికెట్ అభిమానులను అలరించనుందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఐదు సంవత్సరాల సుధీర్ఘ విరామం తర్వాత, తిరిగి మెన్స్ చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నమెంట్ను (ICC CLT) 2026 సెప్టెంబరు నుంచి ప్రారంభించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సింగపూర్లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో కీలక సభ్యదేశాలు ఈ ప్రతిపాదనకు మద్దతిచ్చాయి. దీంతో, ఈ టోర్నీ పున:ప్రారంభం అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నమెంట్ 2008-2014 మధ్యకాలంలో జరిగింది. అయితే, ప్రసార హక్కుల కోసం ఏకంగా 1 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందం కుదుర్చుకున్న ఈఎస్పీఎన్ స్టార్ సంస్థ… ఐపీఎల్ ప్రసార హక్కులను కూడా ఆశించింది. కానీ, దక్కకపోవడంతో ఛాంపియన్స్ లీగ్ టీ20 ప్రసారం నుంచి వైదొలగింది. దీంతో టోర్నీ నిలిచిపోయింది. అప్పటివరకు ఈ లీగ్ను బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, క్రికెట్ సౌతాఫ్రికా సంయుక్తంగా నిర్వహించాయి. కాగా, కొత్తగా టోర్నీ ప్రారంభమైతే ఆదాయాన్ని ఎలా పంచుకోవాలి అన్న దానిపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు, సౌదీ అరేబియా ఫండింగ్తో మరో టీ20 లీగ్ కూడా మొదలుపెట్టాలన్న ప్రతిపాదన కూడా ఐసీసీ పరిశీలనలో ఉంది.
టెస్ట్ క్రికెట్ భవిష్యత్పై చర్చ
టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. టెస్టు క్రికెట్ ఆడే జట్లను రెండు డివిజన్లుగా విభజించే ఫార్మాట్ను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనకు ఈ సమావేశంలో సానుకూలత వ్యక్తమైంది. ఈ ఏడాది చివరి నాటికి టెస్టు ఫార్మాట్పై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టెస్టు క్రికెట్ ఆడే దేశాల సంఖ్యను మరింత పరిమితం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టెస్ట్ ఫార్మాట్ ద్వారా కొద్ది దేశాలు మాత్రమే ఆదాయం సంపాదించగలుగుతున్నాయి. మరోవైపు, టెస్ట్ క్రికెట్ పటిష్టం చేసే విధంగా కొన్ని దేశాల్లో సరైన మౌలిక సదుపాయాలు కూడా ఉండడం లేదు. అందుకే, టెస్టు క్రికెట్ భవిష్యత్పై అంతసానుకూలత వ్యక్తం కావడం లేదు.
Read Also- Team India: టీమిండియాకు ఎదురుదెబ్బ.. సీఎస్కే ప్లేయర్కు సెలక్టర్ల పిలుపు
క్రికెట్ గ్లోబల్ క్యాలెండర్ తయారీకి కమిటీ
2027 నుంచి క్రికెట్ గ్లోబల్ కాలెండర్ను తిరిగి తయారు చేయడంపై ఐసీసీ ఒక వర్కింగ్ గ్రూపును కూడా ఏర్పాటు చేసింది. ఈ వర్కింగ్ గ్రూపులో క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో టాడ్ గ్రీన్బర్గ్, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చీఫ్ రిచర్డ్ గోల్డ్, ఐసీసీ నూతన సీఈవో సంజోగ్ గుప్తా ఉన్నారు. ఈ గ్రూపు ఈ ఏడాది చివరి నాటికి మధ్యంతర నివేదికను ఐసీసీ బోర్డుకు సమర్పించనుంది. సంజోగ్ గుప్తా గతంలో బ్రాడ్కాస్టింగ్ దిగ్గజం ‘జియోస్టార్’లో (JioStar) స్పోర్ట్స్ హెడ్గా పని చేశారు. ఆటగాళ్ల గ్లోబల్ అసోసియేషన్ రూపొందించిన క్రికెట్ కాలెండర్ రిపోర్టులో ఆయన కీలక పాత్ర పోషించారు. “క్రికెట్ ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో గమనించి పయనించాల్సిన దిశను నిర్ణయించాలి” అని 2023లో లార్డ్స్ వేదికగా జరిగిన ఎంసీసీ క్రికెట్ కనెక్ట్స్ ప్యానెల్ భేటీలో వ్యాఖ్యానించారు. “ఫ్యాన్స్ ఆసక్తిలేని ఒక ఉత్పత్తిని అందిస్తూనే ఉంటే, ఆ ఉత్పత్తి కనుమరుగయ్యే ముప్పు ఉంది. క్రికెట్ వ్యవస్థ దెబ్బతింటుంది. అందరి దగ్గర ఉండే బ్లాక్బెర్రీ ఫోన్లు ఎలా మాయమైపోయాయో ఈ సందర్భంగా గుర్తుతెచ్చుకోవాలి. ఎవరూ వాడకపోవడంతో అది మరుగునపడింది’’ అని కూడా గుప్తా వ్యాఖ్యానించారు. దీనిని బట్టి టెస్ట్ క్రికెట్కు అంతగా ప్రాధాత్యత ఇవ్వబోరని స్పష్టమవుతోంది.
Read Also- Hardik Pandya: హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో మరో కీలక పరిణామం?