Red Sea cable cut: ఎర్ర సముద్ర (Red Sea) గర్భంలో ఇంటర్నెట్ కేబుల్స్ (Red Sea cable cut: ) దెబ్బతిన్నాయి. ఈ ప్రభావంతో భారత్, పాకిస్థాన్, మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాలలో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారత్, పాకిస్థాన్తో పాటు యూఏఈలో కూడా ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. యూఏఈలో ప్రధాన టెలికం నెట్వర్క్లైన ఎతిసలాట్, డూ ఇంటర్నెట్ సేవలు నెమ్మదించాయి. రెడ్ సీలో రెండు ప్రధాన అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుళ్లు డ్యామేజీ కావడమే ఇందుకు కారణంగా ఉంది.
సముద్రంలో కేబుళ్లు ఎవరు వేస్తారు?
సముద్రంలో కొన్ని వేల కిలోమీటర్ల మేర ఇంటర్నెట్ కేబుళ్లు పరచి ఉంటాయి. వీటిని మెజారిటీగా ప్రైవేట్ టెలికం కంపెనీలు, టెక్ కార్పొరేషన్లు, కొన్ని అంతర్జాతీయ కన్సార్టియాలు ఏర్పాటు చేస్తాయి. ఈ కేబుళ్లు చాలా ఖరీదైనవి. వీటిని సముద్రంలో జాగ్రత్తగా ఏర్పాటు చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమవుతుంది. ప్రపంచ డేటా ట్రాఫిక్లో సుమారు 95 శాతం వరకూ సముద్ర కేబుళ్లు మోస్తాయంటే సేవలు ఎంత ప్రభావితమైనవో అర్థం చేసుకోవచ్చు.
ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు.. అందుకే డ్యామేజీ
ఎర్ర సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇంటర్నెట్ కేబుళ్లు దెబ్బతిన్నాయి. యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు 2023 చివరి నుంచి ఇప్పటివరకు, రెడ్ సీ మీదుగా ప్రయాణించిన 100కి పైగా నౌకలపై దాడులు చేశారు. ఈ ఘటనల్లో 4 నౌకలు మునిగిపోయాయి. 8 మందికి పైగా నావికా సిబ్బంది మృతి చెందారు. ఈ దాడులకు ప్రతీకారంగా అమెరికా, మిత్ర దేశాలు దాడులు చేశాయి. ఇజ్రాయెల్ కూడా పలు ఆపరేషన్లు చేపట్టింది. ఈ క్రమంలో హౌతీ తిరుగుబాటుదారులు సముద్ర కేబుళ్లను టార్గెట్గా చేసుకొని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని యెమెన్ ప్రభుత్వం ఆరోపించింది.
అయితే, ఇంటర్నెట్ కేబుల్స్ దెబ్బతిన్న విషయంతో తమకు సంబంధంలేదని హౌతీ గ్రూప్ ప్రకటించింది. కేబుళ్లు దెబ్బతిన్న మాట నిజమేనని హౌతీకి చెందిన అల్ మసీరా టీవీ ఛానల్ అంగీకరించింది. అయితే, ఈ నష్టానికి హౌతీలు కారణం కాదని పేర్కొనలేదు.
Read Also- Nepal Gen Z protests: సోషల్ మీడియాపై ఆంక్షలు.. అట్టుడుకుతున్న నేపాల్.. పార్లమెంట్ భవనానికి నిప్పు
కేబుల్స్ ఎలా డ్యామేజ్ అవుతాయి?
సముద్రపు అడుగున పరచివుండే ఇంటర్నెట్ కేబుళ్లు చాలా సురక్షితంగా ఉంటాయి. వాటిని సాధారణంగా ఏవీ తాకవు. సంస్థలు ప్రత్యేకమైన నౌకల ద్వారా సముద్రంలో కేబుళ్లు పరుస్తాయి. భూకంప ప్రభావిత ప్రాంతాలు, లోతైన సముద్ర గర్భగుహలు, ఓడల రవాణా మార్గాలు వంటి డేంజర్ జోన్లను తప్పించుకుంటూ కేబుళ్లను ఏర్పాటు చేశారు. అయితే, నౌకల యాంకర్లు, లేదా ఉద్దేశపూర్వకంగా దాడులు చేసినప్పుడు మాత్రమే వాటికి తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఒక్కసారి డ్యామేజీ జరిగితే మరమ్మతు పనులు చేయడం చాలా కష్టమైన ప్రక్రియ. ఎందుకంటే, ప్రత్యేకమైన నౌకలు, నిపుణుల బృందాన్ని రంగంలోకి దించాల్సి ఉంటుంది. దెబ్బతిన్న కేబుల్ భాగాన్ని గుర్తించి, అక్కడికి చేరుకుని, సముద్ర గర్భంలో తేలియాడుతూ కేబుల్ మరమ్మత్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని వారాల సమయం పడుతుంది.
Read Also- Chris Gayle: పంజాబ్ కింగ్స్ జట్టుపై క్రిస్ గేల్ సంచలన ఆరోపణలు
ఇక, గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్కు రెడ్ సీ ఒక ప్రధానమైన మార్గంగా పనిచేస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల ఇంటర్ రీజినల్ బ్యాండ్విడ్త్లో 50 శాతానికిపైగా రెడ్ సీ మార్గం ద్వారా యూరప్కి చేరుతోంది. యూరప్-ఆసియా ఇంటర్నెట్ సామర్థ్యంలో 90 శాతం కంటే ఎక్కువ రెడ్ సీ కేబుళ్ల ద్వారానే జరుగుతోంది. అందుకే, రెడ్ సీ ప్రాంతంలో కేబుళ్లకు నష్టం జరిగితే, గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది.
భారత్లో సుమారు 17 అంతర్జాతీయ కేబుళ్లు ఉన్నాయి. 14 ల్యాండింగ్ స్టేషన్ల వద్ద సముద్రం నుంచి భూమిపైకి వస్తున్నాయి. ఈ స్టేషన్లు ముంబై, చెన్నై, కొచ్చి, ట్యూటికోరన్, త్రివేంద్రం వంటి నగరాల్లో ఉన్నాయి. ఈ ల్యాండింగ్ స్టేషన్ల నుంచే భారతదేశ ఇంటర్నెట్ ప్రపంచంతో కలుస్తోంది. దీనిని బట్టి సముద్రంలో ఏర్పాటు చేసిన కేబుళ్లపై ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థ ఎంతగా ఆధారపడుతోందో అర్థం చేసుకోవచ్చు.