Shivaji Statue: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని బంధనపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున దుండగులు ఘోర దుశ్చర్యకు పాల్పడ్డారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇటీవలే చత్రపతి శివాజీ(Shivaji) విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అన్ని పనులు పూర్తికావడంతో త్వరలోనే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున ఆకతాయిలు విగ్రహానికి నిప్పు పెట్టడం తీవ్ర కలకలం రేపింది.
Also Read: Anil Ravipudi: ఆ రోజు ఆ ఈవెంట్ లేకపోతే.. నేను డైరెక్షన్ వైపు వెళ్లే వాడినే కాదు..
భద్రత కట్టుదిట్టం
విగ్రహానికి నిప్పు పెట్టిన విషయం ఉదయం గ్రామస్థులకు తెలిసింది. వెంటనే సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ గౌరవాన్ని, చరిత్రాత్మక వ్యక్తిత్వాన్ని అవమానపరిచే ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విగ్రహం చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉందా..? సామాజిక విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నమా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి నిందితులను త్వరగా గుర్తించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి అంటూ గ్రామస్తులు పోలీసులను కోరారు. చత్రపతి శివాజీ లాంటి మహనీయుడి విగ్రహంపై దాడి చేయడం సమాజంలో శాంతిభద్రతలను భంగం చేసే చర్యగా వారు అభివర్ణించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా బంధనపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
Also Read: Gold Rates: ఏడాది చివరి రోజున భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..!

