Ttd | తిరుమల పుణ్యక్షేత్రం టీటీడీ ఉద్యోగి బాలాజీపై బోర్డు సభ్యుడు నరేష్ (naresh) చేసిన బూతుపురాణం తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా టీటీడీ ఉద్యోగులు నిరసనకు దిగారు. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముందు టీటీడీ ఉద్యోగులందరూ ఆందోళన చేస్తున్నారు. నరేష్ కుమార్ క్షమాపణలు చెప్పి, రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాంతో టీటీడీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
నిన్న తిరుమలకు (tirumala) వచ్చిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్.. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మహాద్వారం నుంచి బయటకు వెళ్లాలని అనుకున్నాడు. కానీ మహాద్వారం నుంచి ఎవరినీ బయటకు పంపట్లేదని.. ఏదైనా ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాడుకోవాలని అక్కడే ఉన్న ఉద్యోగి బాలాజీ తెలిపాడు. దాంతో నరేష్ కుమార్ ఆవేశంతో ఊగిపోయాడు.. ‘ఏయ్ ఎవరనుకున్నావ్. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా. థర్డ్ క్లాస్ నా కొడుకువి. నాకు చెప్తావా.. వెల్లిపో ఇక్కడి నుంచి’ అంటూ బూతులు మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆయన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పవిత్రమైన ఆలయంలో ఉండి ఇలాంటి బూతులు మాట్లాడుతావా అంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.