ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి దావోస్ పర్యటనపై కడప వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారిని తరిమికొట్టిన ఘనత వైసీపీ అధినేత జగన్ కే దక్కుతుందని చురకలంటించారు. గత వైసీపీ ప్రభుత్వం వల్లే పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదని మంత్రి ధ్వజమెత్తారు.
కాగా, ఇటీవల సీఎం బృదం పెట్టుబడుల కోసం దావోస్ పర్యటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనపై వైసీపీ నేతలు రకరకాల విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ… “దావోస్ వెళ్తున్నాం.. అద్భుతమైన పెట్టుబడులు తెస్తాం అని చెప్పావ్. 2017 నుంచి చెప్తూనే ఉన్నావ్. కానీ అక్కడ ఎంఓయు జరిగినది ఒక్కటైనా ఇక్కడ మెటీరియలైజ్ కాలేదు. ఎంతకాలం ఇలా మభ్యపెడతారు” అంటూ చంద్రబాబుని విమర్శించారు.
అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. శ్రీకాంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా చేసి, పెట్టుబడిదారులందరినీ పక్క రాష్ట్రాలకు తరిమేసి ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది. ఆరోజు జగన్ చేసిన దాష్టీకాలు రాష్ట్రంలో, కేంద్రంలో, అంతర్జాతీయంగా తెలిసిపోయింది. అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది” అని మంత్రి చురకలంటించారు.