National Award to Telangana: ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలం లోని మాల్ గ్రామ పంచాయతీ జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. అవార్డు రావడంపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులను సమీకరించుకునీ సాధికారతకు, స్వయం సమృద్ధి కి నిర్వచనంగా మారిందని వెల్లడించారు. మాల్ పంచాయతీ ఆర్థిక స్వావలంబన కోసం కృషిచేసిన అధికారులను అభినందించారు.
మాల్ ఆదర్శంగా ప్రతీ గ్రామపంచాయతీ ఎదగాలని ఆకాంక్షించారు. బీహార్ లోని మధుబనీలో గురువారం జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అవార్డును జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి లతో కూడిన అధికారుల బృందం అవార్డు అందుకోనుంది. ఈ అవార్డు కింద కోటి రూపాయల ప్రోత్సాహక బహుమతి లభించనుంది.
ఆర్థిక స్వావలంబన సాధించిన పంచాయతీలకు ఈ అవార్డు ఇస్తారు. ప్రభుత్వ నిధుల మీద ఆధారపడకుండా సొంత ఆదాయ వనరులను మాల్ గ్రామపంచాయతీ సమకూర్చుకుంది. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల కూడలిలో ఉన్న మాల్ గ్రామం ఏడాదికి రూ.90 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తోంది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు