MLA Arekapudi Gandhi: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై కత్తులతో దాడి జరగబోతోందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వాట్సాప్ మెసెజ్ తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే…ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆదివారం సాయంత్రం గోశాలకు వెళ్లే సమయంలో ఆయనపై అరవింద్ కుమార్, సాయి రితీష్ రెడ్డి, కోలా వంశీ, గుళ్ల నాగరాజు అనే వ్యక్తులు కత్తులతో దాడి చేయనున్నారంటూ పలువురికి వాట్సాప్ మెసెజ్ వచ్చింది.
వీరిపై గతంలో అక్రమ ఆయుధాల కేసులు ఉన్నాయన్న నేరారోపణలపై కేసులు కూడా నమోదయ్యాయని ఆ మెసెజీలో అగంతకులు పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు అప్రమత్తమయ్యారు. విషయాన్ని పోలీసులకు తెలియచేశారు. కాగా, అరవింద్ కుమార్ మాట్లాడుతూ తమపై గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
Also Read: Medchal Crime: బిడ్డకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్యాయత్నం.. చివరికి ఒకరు మృతి..
నలుగురి అరెస్ట్…గంజాయి సీజ్
వేర్వేరు చోట్ల దాడులు జరిపిన ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి 2.366 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పురానాపూల్ లోని ఓ ఇంట్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు సమాచారం అందటంతో ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ సీఐ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు.
గంజాయి అమ్ముతున్న చంద్రముఖి, ఆకాశ్ సింగ్ లను అరెస్ట్ చేసి వారి నుంచి 1.206 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఇక, ఆసిఫ్ నగర్ లోని బాలాజీ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద గంజాయి అమ్ముతున్న మహ్మద్ అఫ్జల్, అమిత్ లను అరెస్ట్ చేసి వారి నుంచి 1.16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి ఆయా ఎక్సయిజ్ పోలీస్ స్టేషన్లలో అప్పగించారు.