Medchal Crime: నాలుగేళ్ల కూతురికి విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఉదంతమిది. ఈ సంఘటనలో చిన్నారి మరణించగా తల్లి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికంగా తీవ్ర విషాదం సృష్టించిన ఈ సంఘటన బాచుపల్లి ప్రగతినగర్ లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రగతినగర్ లోని హరిత ఆర్కెడ్ లో నివాసముంటున్న కృష్ణ పావని (33), సాంబ శివరావు భార్యాభర్తలు. వీరి కూతురు జశ్విక (4). ఇదెలా ఉండగా కొంతకాలంగా కృష్ణ పావని ఆరోగ్య పరమైన సమస్యలతో సతమతమవుతోంది.
ఈ క్రమంలో తనకేదైనా జరిగితే కూతురు అనాధ అవుతుందని భావించిన ఆమె ఈనెల 18న రాత్రి మాజా కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలిపి జశ్వికతో తాగించింది. ఆ తరువాత తాను కూడా విషం కలిపిన కూల్ డ్రింక్ ను సేవించింది. ఆ మరుసటి రోజు తీవ్ర స్థాయిలో కడుపునొప్పి రావటంతో విషయాన్ని భర్తకు తెలిపింది. వెంటనే సాంబ శివరావు భార్య, కూతురిని కేపీహెచ్బీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
Also Read: Reddy Betting App: వైఎస్ జగన్ ఆశీస్సులున్నాయా? నా అన్వేషణ షాకింగ్ వీడియో!
అక్కడ చికిత్స పొందుతూ జశ్విక తుదిశ్వాస వదిలింది. కృష్ణ పావని ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది. బాచుపల్లి పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, జశ్విక చనిపోవటంపై అపార్ట్ మెంట్ వాసులు బాధను వ్యక్తం చేశారు. అపార్ట్ మెంట్ లో అందరినీ పలకరిస్తూ చిన్నారి జశ్విక ఆడుకునేదని గుర్తు చేసుకున్నారు. తమకిచ్చినా పెంచుకునే వారమని ఆవేదన వ్యక్తం చేశారు.