Rangareddy District: చెరువులను పరిరక్షించాల్సిన అధికారులే వినాశానికి కారణమైతున్నారు. రెవెన్యూ(Revenue), ఇరిగేషన్(Irrigation) శాఖల మధ్య సమన్వయ లోపంతోనే జిల్లాలోని చెరువులు, కుంటలు కబ్జాలకు గురైతున్నాయి. జిల్లాలో 139 చెరువులు, 1894 కుంటలు కలిపి 2033 ఉన్నాయి. వీటిలో దాదాపు వెయ్యి చెరువులు కబ్జాలకు గురైనట్లు అధికారులే చేబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోని చెరువులన్ని పూర్తిగా ధ్వంసమైనాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే ఇంతో అంతో కబ్జాలకు గురికాకుండా ఉన్నాయి. చెరువులు, కుంటల పక్కన ఉండే స్థలాలు బఫర్ జోన్లో ఉంటాయి. ఇలాంటి స్థలాల్లో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు. కానీ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తమ స్వలాభం కోసం ఎన్వోసీ(NOC)లు ఇవ్వడంతో భవనాలు వెలుస్తున్నాయి. దీంతో పక్కనే ఉన్న చెరువులు, కుంటలను క్రమక్రమంగా కబ్జాలు చేస్తున్న వైనం జిల్లాలో కనిపిస్తోంది.
రెవెన్యూ ఆదేశాలు- సహకరించని ఇరిగేషన్..
స్ధానిక ప్రజలు చెరువులు, కుంటలు కబ్జాలకు గురైనట్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా రెవెన్యూ యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారుల సమక్షంలో సర్వే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. కానీ ఇరిగేషన్ అధికారులు ఆ సర్వేలతో మాకేంపని లేదనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని శంషాబాద్, మహేశ్వరం(Maheshwaram), హయత్నగర్(Hayathnagar), అబ్దుల్లాపూర్(Abdullapur) మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు కబ్జాలకు గురైనట్లు స్థానికులు హైడ్రా(Hydraa) అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈవిషయం తెలుసుకున్న హైడ్రా అధికారులు స్థానిక అధికారుల ద్వారా నివేదిక ఇవ్వాలని కోరారు. ఇరిగేషన్ అధికారుల వద్ద సమాచారం సరిగ్గా లేదని సమాచారం. అదేవిధంగా ఇబ్రహింపట్నం మండలం ఆదిబట్ల గ్రామంలోని ఫిరంగి నాల కబ్జాకు అయినట్లు స్థానికులు ఫిర్యాదులు చేశారు. ఇబ్రహింపట్నం మండల కేంద్రంలోని పెద్దచెరువు పక్కనే పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇక్కడి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షించి, పరిశీలించేందుకే పరిమతమైనారు. కానీ చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేశారు. ఒకరిపై ఒకరు చెప్పుకొని కాలం గడుపుతున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని అనువుగా తీసుకొని ఇష్టారాజ్యంగా భూకబ్జాలకు పాల్పడుతున్నారు.
Also Read: Ram Charan: ‘పెద్ది’ కోసం వాటిని పక్కన పెట్టిన రామ్ చరణ్.. అయినా పర్లేదా?
అభివృద్ధి పేరిట ధ్వంసం..
పట్టణీకరణ నేపథ్యంలో జిల్లా పరిధిలోని అర్బన్ ప్రాంతంలోని మెజార్టీ చెరువులు కనుమరుగయ్యాయి. అక్కడక్కడా ఉన్నవీ కబ్జాలతో భారీగా కుంచించుకుపోయాయి. ఈ నేపథ్యంలో చెరువుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టిసారించిన ప్రభుత్వం అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఎఫ్టీఎల్ చుట్టూ వాకింగ్ ట్రాక్లు, ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు, మురుగు నీటి శుద్ధికి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీలు) నిర్మించాలని సూచిస్తోంది. కానీ అదే ప్రభుత్వానిక సంబంధించిన మరోక సంస్థలకు స్థలాలు దోరకకపోవడంతో బఫర్ జోన్లోనే విద్యుత్ సంస్థ సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఇరిగేషన్ విభాగం ఎఫ్టీఎల్ గుర్తించడంలో విఫలమైయింది. అధికారులు తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కొన్నిచోట్ల ఎఫ్టీఎల్ బయట గుర్తిస్తూ.. చెరువు మధ్యలో కట్టలు నిర్మిస్తున్నారు. చెరువు. కుంటల చూట్టు30 మీటర్లు (100 అడుగులు) బఫర్ జోన్గా పరిగణిస్తారు. బఫర్ జోన్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దు. ఇక్కడ మాత్రం ఏకంగా చెరువులోపలే బండ్ నిర్మిస్తూ… చుట్టూ ట్రాక్లు, ఇతరత్రా అభివృద్ధి చేయాలని భావిస్తుండడం గమనార్హం.
ప్రభుత్వం చెరువుల పై నిఘా..
రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చెరువులను పరిరక్షించాలని యోచిస్తుంది. అందుకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సూచన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికారుల ద్వారా చెరువుల వివరాలు సేకరించి ఏ ఏ స్థాయిలో ఉన్నాయో ప్రభుత్వం తీసుకున్నట్లు తెలుస్తుంది. హైడ్రా చెరువులు కాపాడేందుకు కీలక భాగస్వామ్యం కానుంది. ప్రస్తుత వాతావరణం దృష్ట్యా చెరువుల పరిస్థితి బహిర్గతం కానున్నట్లు తెలుస్తుంది.
Also Read: Damodar Rajanarsimha: స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం టాప్ గేర్: మంత్రి దామోదర రాజనర్సింహ
