Chevella Municipality: స్వేచ్ఛ, చేవెళ్ల గ్రామ పంచాయతీగా కొనసాగిన చేవెళ్ల పరిధిలోని 12 గ్రామాలను కలుపుకొని ఇటీవల మున్సిపాలిటీగా అవతరించడంతో తొలిసారి నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మున్సిపాలిటీ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్(Congress) పార్టీలోనే రెండు వర్గాలు పోటీపడుతుండటంతో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు మాజీ పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి(Devara Venkat Reddy), మాజీ జడ్పీటీసీ సభ్యురాలు మాలతి కృష్ణారెడ్డి(Malathi Krishnareddy) ఇద్దరూ ప్రధాన ఆశావహులుగా ముందుకొస్తున్నారు.
అవసరాలపై స్పష్టమైన ప్రణాళిక
వీరిద్దరూ పార్టీకి అనేక సంవత్సరాలుగా సేవలందిస్తూ ప్రజల్లో గుర్తింపు సంపాదించుకున్న నేతలే కావడంతో ఎవరి వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతుందన్నది కీలకంగా మారింది. మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత జరిగే తొలి ఎన్నిక కావడంతో స్థానిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పట్టణ అవసరాలపై స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లే నాయకుడికి అవకాశం కల్పించాలని కాంగ్రెస్(Congress) శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అదే సమయంలో అంతర్గత పోటీ పార్టీ ఐక్యతపై ప్రభావం చూపకూడదని సీనియర్ నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందన్న అంశంపై కార్యకర్తలు, ప్రజల్లో చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేవెళ్ల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపుగా మారనుందని స్థానిక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Gajwel Congress: గజ్వేల్ కాంగ్రెస్ నేతల్లో బలపడుతున్న సంకల్పం.. చేయి కలిపిన మరో వర్గ నేత..?

