మహబూబ్ నగర్: Bhu Bharati Portal: ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా భూభారతికి అంకురార్పణ జరిపినట్లు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. రైతుల హక్కుల్ని పెత్తందార్ల కాళ్ల వద్ద తాకట్టు పెట్టేలా ధరణిని గత బిఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిందన్నారు. రాబోయే రోజుల్లో సాగు భూములకు పక్కాగా హద్దులు నిర్ణయించేందుకు భూభారతి ద్వారా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. మక్తల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ భూ భారతి చట్టం 2025 పైన రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ శిక్త పట్నాయక్ గారితో కలిసి మక్తల్ ఎమ్మెల్యే శ్రీ వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన భూ భారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే వాకిట శ్రీహరి రెవెన్యూ యంత్రాంగానికి సూచించారు. తెలంగాణలో వివాద రహిత భూ విధానాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని ఆయన స్పష్టం చేశారు. ఆధార్ తరహాలో భవిష్యత్లో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో భూధార్ తీసుకొస్తామని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి శుభసందర్భంగా ప్రభుత్వం నూతనంగా తెచ్చిన భూ భారతి చట్టం, భూ భారతి పోర్టల్ను ముఖ్యమంత్రి శిల్ప కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు అని అన్నారు.
Aalso Read: Palm Oil In Khammam: పామాయిల్ మొక్కలతో రైతులు విలవిల.. లెక్కచేయని అధికారులు
పైలట్ ప్రాజెక్టుగా తొలి విడత భూ భారతిని మక్తల్ మండలాల్లో చేపడుతున్న. ప్రజా పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు, ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉంది అని అన్నారు. రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువలో ఉంచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. అందుకోసమే 10954 గ్రామ పాలన అధికారులను నియమించబోతున్నాం. గత పాలకుల తరహాలో రెవెన్యూ సిబ్బందిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ఆలోచనకు ప్రజా ప్రభుత్వం వ్యతిరేకమన్నారు.
ఎంతో మంది అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో భూ భారతి చట్టం తెచ్చామన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి విజ్ఞప్తులను తీసుకుని వాటిని పరిష్కరించాలన్నారు. రెవెన్యూ శాఖపైన కొందరు సృష్టించిన అపోహలను తొలగించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది అని అన్నారు. ఆర్ ఓ ఆర్ భూమి హక్కుల పరిరక్షణ, రిజిస్ట్రేషన్ ముటిషన్ జరుగుతాయని తెలిపారు.
వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటిషన్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ శిక్త పట్నాయక్ తహసీల్దార్ సతీష్ కుమార్, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, యువ నాయకులు, నాయకులు పాల్గొన్నారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/