illegal Grain Transport: ఇతర రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా రవాణా
illegal Grain Transport ( image credit: swetcha reporter)
Telangana News

illegal Grain Transport: ఇతర రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా రవాణా.. సరిహద్దుల్లో కానరాని సివిల్ సప్లై చెక్ పాయింట్లు

illegal Grain Transport:  అధికారుల నిర్లక్ష్యం రైతన్న పాలిట శాపంగా మారుతున్నది. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తరలి రాకుండా చర్యలు తీసుకోవాల్సిన వారు చోద్యం చూస్తుండడంతో యథేచ్ఛగా రవాణా జరుగుతున్నది. చెక్ పోస్టులు పెట్టి రాకుండా అడ్డుకుంటామని అధికారులు చేసిన ప్రకటనలు నీటి మీద రాతలయ్యాయి. ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమంగా ధాన్యం రాకుండా అడ్డుకట్ట వేస్తామని ప్రకటించినప్పటికీ తాజాగా కర్నాటక నుంచి ధాన్యం లోడుతో రాష్ట్రానికి వచ్చిన లారీ పట్టుబడింది. ఇప్పటికే పదుల సంఖ్యలో లారీలు వచ్చినట్లు సమాచారం. ఏపీ నుంచి కూడా వస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

Also Read: Illegal Cattle Transport: చర్ల వయా భద్రాచలం టు కురవి .. స్వేచ్ఛ కథనం సోషల్ మీడియాలో వైరల్

కర్నాటక నుంచి జోరుగా ధాన్యం

వానాకాలం సీజన్‌లో 65.96 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని, 159.15 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ ధాన్యంలో 75 లక్షల టన్నులను ప్రభుత్వం సివిల్ సప్లై శాఖ ద్వారా సేకరించనున్నట్లు ప్రకటించింది. అందులో 53 లక్షల టన్నులకు ఎఫ్సీఐ ద్వారా ఏ గ్రేడ్‌కు రూ.2,389, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2,369 చొప్పున మద్దతు ధరతో కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా మరో రూ.500 బోనస్ రూపంలో అందిస్తున్నది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం తరలి వస్తున్నది. ప్రభుత్వ టార్గెట్ పూర్తి అవుతుండడంతో తెలంగాణ రైతాంగం ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నది. ఈ సారి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు.

17 జిల్లాల్లో 56 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులను ఏర్పాటు

ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా అరికట్టేందుకు రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 56 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సీసీ కెమెరాలతో సర్వే లెన్స్ ఏర్పాటు చేసి, ఆకస్మిక తనిఖీలు చేస్తూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేటివ్, పోలీసు శాఖల సమన్వయంతో ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

అధికారులు పట్టించుకోవడం లేదు 

అయితే, కర్నాటక నుంచి ధాన్యం యథేచ్ఛగా వస్తుందనేది స్పష్టమవుతున్నది. అక్కడి ధాన్యం లారీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నాటక నుంచి జోరుగా ధాన్యం తరలివస్తున్నా వాటిని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కృష్ణ వాసునగర్ చెక్‌పోస్ట్ దగ్గరకు  అర్ధరాత్రి 7 ధాన్యం లారీలు రాగా ఒక లారీని మాత్రమే మాగనూరు పోలీసులు నల్లగట్టు సమీపంలో పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించి సంబంధిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు శుక్రవారం వరి ధాన్యం లోడును పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోకుండానే కర్ణాటక పంపించారు.

ఇప్పటికైనా చర్యలుంటాయా?

రాష్ట్రంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో సరిహద్దుల్లో 15 చెక్ పోస్టులు ఉండేవి. వాటిని తొలగించడం, సివిల్ సప్లై అధికారులు సైతం ఏర్పాటు చేశామన్న ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల్లో సిబ్బంది పర్యవేక్షణ లోపించడం, కొన్ని చెక్ పోస్టుల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతోనే కర్నాటక, ఏపీ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం ధాన్యం వస్తున్నట్లు సమాచారం. సన్న ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వడంతో ఇతర రాష్ట్రాల రైతులు తెలంగాణకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నిత్యం చెక్ పోస్టులపై మానిటరింగ్ చేయాల్సిన రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం, ఎన్‌ఫోర్స్‌మెంట్ సైతం చోద్యం చూస్తుండడంతో యథేచ్ఛగా ధాన్యం తెలంగాణకు వస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సివిల్ సప్లై ఉన్నతాధికారులు స్పందించి ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఆంధ్రా నుంచి కూడా..

యాసంగిలోనూ నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్​ వద్ద ఆంధ్రా నుంచి వస్తున్న 7 ధాన్యం లారీలను సీజ్​ చేశారు. అక్కడి ధాన్యాన్ని తెలంగాణలో అక్రమంగా విక్రయిస్తున్న దళారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతర రాష్ట్రాల ధాన్యాన్ని తెలంగాణకు రాకుండా మిర్యాలగూడ డివిజన్ పరిధిలో వాడపల్లి, సాగర్ వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ మిర్యాలగూడకు అధిక మొత్తంలో లారీలు వస్తుండడంతో పోలీసులు వాటిని తిప్పి వెనుకకు పంపించారు. మళ్లీ వానాకాలంలో పునరావృతం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా సివిల్ సప్లై అధికారులు స్పందించి చెక్ పోస్టులను నిత్యం పర్యవేక్షణ చేస్తూ అక్రమంగా ధాన్యం రాకుండా అడ్డుకట్ట వేస్తారా? లేకుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తారా? అనేది చూడాలి.

Also Read:Illegal Cattle Transport: చర్ల వయా భద్రాచలం టు కురవి .. స్వేచ్ఛ కథనం సోషల్ మీడియాలో వైరల్ 

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?