Jupally Krishna Rao: తెలంగాణను వెడ్డింగ్ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) స్పష్టం చేశారు. పెళ్లి వేడుకలు జరిపించేందుకు ప్రపంచంలో ప్రముఖ గమ్యస్థానంగా తెలంగాణను చూపించడం ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. హైదరాబాద్(Hyderabad) లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో పర్యాటక శాఖ సహకారంతో తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ(Telangana Chamber of Events Industry) ఆధ్వర్యంలో ఆదివారం సౌత్ ఇండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ దేశంలో పెళ్లిళ్ల పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని, అందులో తెలంగాణ రాష్ట్రం కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
వేదికగా తెలంగాణ రాష్ట్రం..
ప్రపంచం మొత్తం భారతదేశాన్ని వెడ్డింగ్ డెస్టినేషన్(Wedding destination)గా చూస్తోందని, అలాంటి సమయంలో తెలంగాణను ప్రపంచ పటంలో వివాహ వేడుకల హబ్ నిలపాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. వివిధ థీమ్స్, బడ్జెట్లకు అనుగుణంగా పెళ్లిళ్లను జరిపేందుకు అద్భుతమైన వేదికగా తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. పురాతన కోటలు, రాజమహాళ్లు, దట్టమైన అడవులు, నదులు సరస్సులు, కొండలు, ఆధునిక విలాసవంతమైన హోటళ్లు తెలంగాణలోని ఈ సంపద ప్రపంచ స్థాయి వెడ్డింగ్ డెస్టినేషన్గా మార్చగల ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని, వెడ్డింగ్ ప్లానర్లు తెలంగాణను కేవలం ఒక రాష్ట్రంగా కాకుండా, ఒక జీవించే సంస్కృతిగా కొత్త దృష్టితో చూసి, దీనిని భారతదేశంలోనే కాక, అంతర్జాతీయంగా పరిచయం చేయాలని పిలుపునిచ్చారు.
Also Read; Telangana Govt: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్… మండలానికో సెంట్రింగ్ యూనిట్!
ప్రత్యేక పర్యటనలు ఏర్పాటు..
తెలంగాణలోని గమ్యస్థానాల వివరాలను ప్రచారంలోకి తీసుకువచ్చి వివాహ వేడుకలను ఎందుకు తెలంగాణలో చేసుకోవాలో తెలిపేలా ప్రణాళికలు రూపొదిస్తామన్నారు. రాష్ట్రంలోని అద్భుతమైన వెడ్డింగ్ డెస్టినేషన్లను పరిశ్రమకు ప్రత్యక్షంగా పరిచయం చేసేందుకు ప్రత్యేక పర్యటనలు ఏర్పాటు చేస్తామని, లైసెన్సులు, అనుమతులు, లాజిస్టిక్స్ , వివాహాల నిర్వహణకు అవసరమైన అనుమతులు వేగంగా మంజూరు చేస్తామని, ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్యంతో ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కొత్త విధానాలు సిద్ధం చేస్తున్నామని,‘మీరు ఆలోచించండి.. మేము అమలు చేస్తాం’ అనే నినాదంతో పర్యాటక శాఖ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, టీసీఈఐ అధ్యక్షుడు ఆళ్ల బలరాం బాబు, ప్రధాన కార్యదర్శి రవి బురా, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Maruthi: చెప్పుతో కొట్టుకున్న ‘బార్బరిక్’ దర్శకుడికి పబ్లిగ్గా డైరెక్టర్ మారుతి క్లాస్!