Kurnool Bus Accident: కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోగా వారిలో ఇద్దరు చిన్నారులు ఉండటం బాధను మరింత పెంచుతోంది. అయితే రోడ్డుపై పడి ఉన్న బైక్ ను డ్రైవర్ ఢీకొట్టిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు తగలబడిపోవడంతో చాలా మంది బయటకు రాలేక మంటల్లో ఆహుతి అయ్యారు. అగ్నికీలలు ఆ స్థాయిలో ఎగసిపడటానికి గల కారణాలపై దర్యాప్తు బృందాలు ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో ఆసక్తికర విషయంలో ఒకటి వెలుగు చూసింది. వేగంగా మంటలు వ్యాపించడం వెనుక 400 ఫోన్లు ఉన్నట్లు తెలుస్తోంది.
మెుబైల్స్ వల్లే భారీ ప్రాణం నష్టం!
ప్రమాదానికి గురిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సును ఫోరెన్సిక్ బృందాలు పరిశీలించగా ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. ప్రమాద ఘటన తీవ్రతకు కారణం బస్సు క్యాబిన్ లో ఉన్న 400 పైగా ఫోన్లు అని ఫోరెన్సిక్ నిపుణులు అంచనావేస్తున్నారు. బస్సుకు ముందు వైపున ఉన్న లగేజీ క్యాబిన్ 400కు పైగా ఉన్న ఫోన్ల పార్సిల్ ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు గుర్తించాయి. బైక్ ను బస్సు ఢీకొట్టగానే అది మెుదట క్యాబిన్ కిందకే వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. బైక్ నుంచి చెలరేగిన మంటలు.. లగేజీ క్యాబిన్ లోని మెుబైల్స్ కు అంటుకున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆ మెుబైల్స్ కు సంబంధించి బ్యాటరీలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆ మంటలు వెంటనే లగేజీ క్యాబిన్ పైన ఉన్న పాసింజర్ కాంపార్ట్ మెంట్ కు వేగంగా వ్యాపించినట్లు సమాచారం. దీంతో లగేజీ క్యాబిన్ కు సరిగ్గా పైన ఉన్న బెర్తుల్లో ఉన్న ప్రయాణికులకు తప్పించుకునే అవకాశమే లేకుండా పోయిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అందువల్లే బస్సు మెుదటి భాగం బెర్తుల్లో ఉన్న వారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని బస్సును పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం తెలిపింది.
నిబంధనలకు విరుద్ధంగా తరలింపు..
సాధారణంగా వందలాది మెుబైల్స్ ను బస్సుల్లో తరలించడానికి ఎలాంటి అనుమతులు లేవు. కానీ ప్రమాదానికి గురైన బస్సులో ఏకంగా 400 పైగా మెుబైల్స్ ఉన్న పార్సిల్ ను తరలించడం చర్చనీయాంశం అవుతోంది. అయితే మెుబైల్స్ తరలించే విషయం బస్ ట్రావెల్స్ వారికి తెలిసే జరిగిందా? లేదా వారికి తెలియకుండా పార్సిల్ రూపంలో తరలించారా? అన్న అంశం తెలియాల్సి ఉంది. ఈ మెుబైల్స్ ఎవరివి? ఎక్కడకు తరలిస్తున్నారు? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Mahabubabad: రాష్ట్రంలో ఘోరం.. మైనర్ బాలికపై అత్యాచారం.. రూ.3 లక్షలకు సెటిల్మెంట్!
బైక్ ను బస్సు ఢీకొట్టలేదట!
బస్సు డ్రైవర్.. ఎదురుగా వెళ్తున్న బైక్ ను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్లు తొలుత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. డ్రైవర్ చెప్పిన విషయాల ఆధారంగా కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. అసలు డ్రైవర్.. బైక్ ను ఢీకొట్టలేదని పేర్కొన్నారు. బైక్ అప్పటికే రోడ్డు మీద పడి ఉందని.. డ్రైవర్ చూసుకోకుండా ముందుకు పోనిచ్చాడని అన్నారు. దీంతో బస్సు కిందకు బైక్ వెళ్లి.. ఒక్కసారిగా నిప్పురవ్వలు వచ్చాయని స్పష్టం చేశారు. దీంతో క్షణాల్లో మంటలు బస్సుకు వ్యాపించి.. ఘోర ప్రమాదం జరిగిందని తెలియజేశారు.
