ACB Telangana: కసరత్తు ప్రారంభించిన డీజీ చారూ సిన్హా
వరంగల్ డీఎస్పీ వసూళ్ల ఉదంతం నేపథ్యంలో చర్యలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ అవినీతి నిరోధక శాఖలో (ACB Telangana) త్వరలోనే పూర్తిస్థాయి ప్రక్షాళన జరుగనున్నట్టు తెలుస్తోంది. వరంగల్ రేంజ్ డీఎస్పీ వసూళ్ల ఉదంతం నేపథ్యంలో ఏసీబీ డీజీ చారూ సిన్హా ఈ మేరకు కసరత్తును ప్రారంభించినట్టు సమాచారం. ముఖ్యంగా ఏళ్లకు ఏళ్లు ఒకే రేంజ్లో తిష్టవేసి ఉన్న అధికారులను స్థానచలనం చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ క్రమంలో ఇలా ధీర్ఘకాలంగా ఒకే రేంజ్లో పని చేస్తున్న అధికారుల జాబితాను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఏసీబీ వరంగల్ రేంజ్లో డీఎస్పీగా పని చేస్తున్న ఓ అధికారి కొంతకాలం క్రితం జిల్లాలో పని చేస్తున్న ఓ ఎమ్మార్వోను ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉన్నా అరెస్ట్ తరువాత సదరు డీఎస్పీ తన చేతివాటాన్ని ప్రదర్శించినట్టుగా ఆరోపణలు వచ్చాయి.
ఎమ్మార్వో నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ నుంచి కాల్ లిస్ట్, వాట్సాప్ చాట్ తీసుకున్న డీసీపీ కొంతమందికి ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డట్టుగా తెలిసింది. అరెస్ట్ అయిన ఎమ్మార్వోకు బినామీలుగా ఉన్నట్టు విచారణలో తేలింది, అరెస్ట్ చేయటం ఖాయమని బెదిరించి లక్షలకు లక్షలు గుంజినట్టుగా వార్తలొచ్చాయి. ఎమ్మార్వోతో పరిచయం ఉండి హైదరాబాద్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పని చేస్తున్న ఓ వ్యక్తిని ఇలాగే బెదరగొట్టి కోటి రూపాయలకు బేరం కుదుర్చుకుని 20లక్షలు తీసుకున్నట్టుగా కూడా సమాచారం. కాగా, డీఎస్పీ బాధితుల్లో ఇద్దరు వాట్సాప్ ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారంలో డొంక కదిలింది. దీనిపై విచారణ ప్రారంభించిన ఏసీబీ అధికారులు ఇప్పటికే ఏడుగురి నుంచి వాంగ్మూలాలు సేకరించారు.
Read Also- New Rules: నవంబర్ 1 నుంచి 7 కొత్త రూల్స్… సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు ప్రభావం!
పదోన్నతి వచ్చినా ట్రాన్స్ఫర్ చేయలేదు
అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ ఆరేళ్లుగా వరంగల్ రేంజ్ లోనే పని చేస్తుండటం గమనార్హం. సీఐగా చేరి డీఎస్పీగా పదోన్నతి పొందిన తరువాత కూడా ఇక్కడే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తనలాంటి వారితో జట్టు కట్టి అవినీతి వ్యవహారాలను నడిపించినట్టుగా ఏసీబీ వర్గాలే చెబుతున్నాయి. అయితే, ఒక్క ఈ అధికారే కాకుండా వేర్వేరు రేంజుల్లో పలువురు అధికారులు ఇలాగే ఏళ్ల తరబడిగా ఒకే చోట కొనసాగుతున్నట్టుగా సమాచారం. ధీర్ఘకాలంగా పని చేస్తున్న వీళ్లలో చాలామంది పొలిటికల్ గాడ్ ఫాదర్ల అండదండలతో కోరుకున్న పోస్టింగులు తెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. రాజకీయ అండ ఉండటంతో తమనెవ్వరూ ఏమీ చేయలేరన్న ధీమాతో కొందరు కరప్షన్ కు చెక్ పెట్టాల్సింది పోయి తామే అవినీతికి పాల్పడుతున్నట్టుగా ఏసీబీ వర్గాలే అంటున్నాయి. నిజానికి సర్కార్ నిబంధనల ప్రకారం విజిలెన్స్, ఏసీబీ వంటి కీలక శాఖల్లో పని చేసే అధికారులను రెండేళ్లకు మించి కొనసాగించ రాదు. అయితే, పైఔ సంపాదనలకు మరిగిన కొందరు అధికారులు తమకున్న పరిచయాలతో దీనిని తుంగలో తొక్కి ఏళ్లకు ఏళ్లు ఒకే రేంజ్ లో విధులు నిర్వర్తిస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also- Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి మెలొడీ సాంగ్ వచ్చేసింది.. ఇక్కడ చూసేయండి..
దృష్టి సారించిన డీజీ…
ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న చారూ సిన్హా ఈ అంశంపై దృష్టి సారించారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరన్న పేరు చారూ సిన్హాకు ఉంది. సమర్థవంతంగా పని చేసే అధికారులను ఎంతగా అభినందిస్తారో…విధుల్లో అలసత్వం వహించిన వారు..అవినీతికి పాల్పడే వారి పట్ల అంతే కఠినంగా వ్యవహరిస్తారని సీనియర్ అధికారులు చెబుతారు. ఇప్పటికే ‘వసూళ్ల సార్’ అవినీతి వ్యవహారంపై విచారణ జరిపిస్తున్న ఆమె అదే సమయంలో ధీర్ఘకాలంగా ఒకే చోట పని చేస్తున్న వారి జాబితాను కూడా సిద్ధం చేయమని ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ లిస్ట్ రాగానే వారందరినీ బదిలీలు చేయనున్నట్టు సమాచారం.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				