New Rule: పోలీసులు, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరాలకు అడ్డుకట్టపడడం లేదు. మరోవైపు, దొంగతనాలకు గురైన ఫోన్లను రికవరీ చేయడం సంక్లిష్టంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన చర్యకు ఉపక్రమించింది. కొత్తగా రాబోయే స్మార్ట్ఫోన్లు అన్నింటిలోనూ ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ యాప్ శ్ర‘సంచార్ సాథీని (Sanchar Saathi) కచ్చితంగా ఉండాల్సిందేనని ఫోన్ల తయారీ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. డిలీట్ చేయడానికి వీలులేకుండా ఈ యాప్ను ప్రీలోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలు పేర్కొన్నాయి. కొత్తగా తయారుచేసే అన్ని మొబైల్ పరికరాల్లోనూ ఈ యాప్ ఉండాలని పేర్కొంది. ఈ మేరకు నవంబర్ 28న కేంద్ర ఆదేశాలు జారీ చేసింది.
90 రోజుల గడువు
‘సంచార్ సాథీ’ యాప్ను కొత్త మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ప్రీ-ఇన్స్టాల్ చేసే విషయమై ప్రధాన స్మార్ట్ఫోన్ కంపెనీలకు 90 రోజులు గడువు ఇస్తున్నట్టు పేర్కొంది. ఈ యాప్ను యూజర్లు డిజేబుల్ (పనిచేయకుండా) చేసే అవకాశం ఉండకూడదనే స్పష్టమైన నిబంధన కూడా విధించింది. అంతేకాదు, ఇప్పటికే మార్కెట్లలో సప్లయ్ దశలో ఉన్న ఫోన్లకు కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఈ యాప్ను పంపించాలని ఆదేశాల్లో పేర్కొంది. సంచార్ సాథీ యాప్ ఈ ఏడాది జనవరిలోనే అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 7 లక్షలకు పైగా పోయిన ఫోన్లను రికవరీ చేయడంలో ఈ యాప్ సహాయపడింది. ఒక్క అక్టోబరర్ నెలలోనే 50 వేలకు పైగా స్మార్ట్ఫోన్లను రికవరీ సాధ్యమైందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Read Also- Telangana Forest: అడవుల రక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వారే సంరక్షకులు..?
యాపిల్ ఫోన్లకు కూడా వర్తింపు
కేంద్ర ప్రభుత్వం గతంలో యాంటీ-స్పామ్ మొబైల్ యాప్ రూపొందించడంపై గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ విముఖత వ్యక్తం చేసింది. ఈ విషయంలో టెలికాం రెగ్యులేటర్తో విభేదించింది. అయితే, కొత్తగా సైబర్ సెక్యూరిటీ యాప్ విషయంలో జారీ చేసిన ఆదేశాలను యాపిల్ కంపెనీ కూడా తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. శాంసంగ్, వివో, ఒప్పో, షియోమీ వంటి సంస్థలతో పాటు యాపిల్ కంపెనీ కూడా కట్టుబడి ఉండాల్సిందేనని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
అయితే, ఈ కొత్త నిబంధన విషయంలో యాపిల్ కంపెనీ ఏమైనా అభ్యంతరాలు చెబుతుందా?, లేక సజావుగా నిబంధనను పాటిస్తుందా? అనేది తెలియాల్సి ఉంటుంది. సాధారణంగానైతే ఆపిల్ కంపెనీ తన సొంత యాప్లను మాత్రమే ఫోన్లలో ప్రీ-ఇన్స్టాల్ చేస్తుంది. ఫోన్ను విక్రయించడానికి ముందు ప్రభుత్వ, లేదా థర్డ్ పార్టీ యాప్లను ఇన్స్టాల్ చేయడాన్ని కంపెనీ అంతర్గత విధానాలు వ్యతిరేకిస్తాయి. మరి, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో యాపిల్ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Read Also- Potatoes: బంగాళదుంపలు ఇష్టమని అతిగా లాగిస్తున్నారా.. అయితే, డేంజర్లో పడ్డట్టే?
ఈ కొత్త రూల్పై ఆపిల్, శాంసంగ్, షియోమీ సహా ఇప్పటివరకు మొబైల్ తయారీ కంపెనీలేవీ స్పందించలేదు. ఉత్తర్వలు మినహా, టెలికాం మంత్రిత్వ శాఖ కూడా స్పందించలేదు. అయితే, ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు కంపెనీలతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదని కంపెనీలు చెబుతున్నట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. ఐఎంఈఐ నంబర్లను మార్చివేసి తప్పుదోవ పట్టించే టెలికాం సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ముప్పును ధీటుగా ఎదుర్కోవడానికి ఈ యాప్ చాలా అవసరమని, స్కామ్లు, నెట్వర్క్ దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చని ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
కాగా, ఫోన్కు ప్రత్యేకంగా ఉండే 14 నుంచి 17 అంకెలతో ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) నంబర్ ఉంటుంది. ఫోన్ను ఎవరైనా దొంగలిస్తే, ఆ ఫోన్లకు నెట్వర్క్ యాక్సెస్ను నిలిపివేయడానికి ఈ ఐఎంఈఐ నంబర్ను ఉపయోగిస్తుంటారు. మరోవైపు, అనుమానాస్పద కాల్స్ను కూడా సంచార్ సాథీ యాప్లో ఫిర్యాదు చేయవచ్చునని, దొంగతనానికి గురైన ఫోన్లను సెంట్రల్ రిజిస్ట్రీ ద్వారా బ్లాక్ చేయడానికి వీలు కల్పిస్తుందని పేర్కొంది. కాగా, ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్లలోని భారతదేశం కూడా ఒకటి. ప్రతినెలా లక్షలాది కొత్త స్మార్ట్ఫోన్ల విక్రయాలు జరుగుతున్నాయి.
