Konda vs Congress: ఓరుగల్లు కాంగ్రెస్లో మాటల యుద్ధం మొదలైంది. కొంతకాలంగా చాపకింద నీరులా పలువురు (Congress) కాంగ్రెస్ నేతల మధ్య సాగిన కోల్డ్ ఇప్పుడు ప్రత్యక్షంగా మాటల తూటాలు పేల్చుకునే స్థాయికి చేరుకున్నది. తాజాగా కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. కొండా మురళి వ్యాఖ్యలపై ఆయన వ్యతిరేక వర్గం ఎమ్మెల్యేలు ఏకంగా సమావేశం అయ్యారు. కొండా మురళి తీరును తప్పుబట్టారు. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. కొండా మురళి బీసీ కార్డును ఉపయోగించుకొని రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
మురళి వాఖ్యలతో తీవ్ర దుమారం
కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ జిల్లా (Congress) కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఇంతకాలం నేతల మధ్య తెర వెనుక సాగిన వివాదం బహిర్గతమైనట్లైంది. కొండ మురళి పరకాల, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలపై (Congress) కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కార్యాలయంలో ఉమ్మడి వరంగల్కు చెందిన పులువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు.
ఈ కీలక సమావేశానికి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, కూడ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, మేయర్ సుధారాణి, మాజీ మంత్రులు బస్వరాజు సారయ్య, విజయరామారావు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ హాజరయ్యారు. కొండా మురళి చేసిన వ్యాఖ్యలు, పార్టీలోని సీనియర్ నేతలను ఉద్దేశించి ఆయన చేసిన ఆరోపణలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
Also Read: Kunamneni Sambasiva Rao: కాళేశ్వరంలో అవినీతిని నిగ్గు తేల్చాలి.. దోషులను కఠినంగా శిక్షించాలి!
గతంలో ఆ పార్టీకి.. ఇప్పుడు కాంగ్రెస్కు ద్రోహం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న కొండా మురళి(Konda Murali) సొంతపార్టీ నేతపై తీవ్ర వాఖ్యలు చేశారు. భవిష్యత్ వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తన కుమార్తె సుష్మిత పటేల్ పోటీ చేస్తుందని ప్రకటించారు. అదే సమయంలో పార్టీలోని కొందరు సీనియర్ నేతలైనా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డిపై పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో పని చేసిన టీడీపీకి నాశనం చేసి తరువాత చేరిన బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కేటీఆర్కు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఇతర నేతలపై కీలక ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి (Kadiyam Srihari) గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని, రాత్రి వేళల్లో బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించి సొంత పార్టీ వారిపైనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్పా (Congress)ర్టీలో చేరిన ఆయన ఇజ్జత్ ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలన్నారు. తానూ పార్టీ మారిన రాజీనామా చేసి గెలిసి వచ్చానన్నారు. బీసీ నేతలమైన తమపై అగ్ర వర్ణాల నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
అడ్డదొడ్డంగా మాట్లాడితే ఊరుకోం
కొండా మురళి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సొంత పార్టీ నేతలపైనే ఆయన బహిరంగంగా విమర్శలు చేయడం, టికెట్ల కేటాయింపుపై ఏకపక్షంగా ప్రకటన చేయడం పట్ల పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు అత్యవసరంగా భేటీ అయి, కొండా మురళి వ్యాఖ్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపాం. కొండా మురళి వ్యాఖ్యలపై హైకమాండ్కు ఫిర్యాదు చేస్తాం. సీనియర్ నేతగా ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. ఈ విషయంపై అధిష్టానం వెంటనే అటో ఇటో తేల్చాలి. ఎవరైనా పార్టీ గీత దాటి మాట్లాడొద్దు. లోకల్ బాడీ ఎన్నికల సమయంలో ఇలా మాట్లాడటం సరైంది కాదు. బీసీ కార్డు ఉపయోగిస్తామంటే కుదరదు. కులాన్ని అడ్డుపెట్టుకుంటే మీరు చేసిన పాపాలు పోతాయని అనుకోవడం మూర్ఖత్వం.
నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే
అధిష్టానం తేరుకోకుంటే వివాదం తీవ్రం
ఇంతకాలం ప్రశాంతంగా ఏక పక్షంగా కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నా ఓరుగల్లు రాజకీయాలు కొండా మురళి వ్యాఖ్యలతో ఒక్కసారిగా వేడెక్కాయి. కొండా మురళి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మరో వర్గం ఎమ్మెల్యేలు నేతలు సమావేశం నిర్వహించడం అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో వరంగల్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. వివాదాలు ఉన్న ఇంతకాలం సైలెంట్గా ఉన్న నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ పరిణామాలపై అధిష్టానం వెంటనే స్పందించి నేతలను కంట్రోల్ చేయకుంటే వివాదం మరింత ముదిరి పార్టీకి తీవ్ర నష్టం కలిగి ప్రమాదం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
Also Read: Medchal Govt Lands: గతంలోనే పలుచోట్ల.. భూముల లెక్క తేల్చిన అధికారులు!