Telangana Politics: రీజినల్ రింగ్ రోడ్(RRR) భూ నిర్వాసితులు స్థానిక ఎన్నికలు బహిష్కరించాలని అభివృద్ధి నిరోధకుడు బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పిలుపునివ్వడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్(Sudhakar Goud) అన్నారు. స్వార్ధ రాజకీయాల కోసం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్(BRS) పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్ మాటలను తెలంగాణ సమాజం ఖండించాల్సిన అవసరం ఉన్నదన్నారు.
అభివృద్ధిలో దూసుకుపోతూ..
హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందన్న విషయం అనేక పదవులు పొందిన కేటీఆర్(KTR) కు తెలియదా? అని బండి ప్రశ్నించారు. రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణమైతే తెలంగాణ దశ, దిశ మారిపోయి, రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఈనాడు మనందరం అనుభవిస్తున్న సౌకర్యాలు రోడ్లు, విద్యుత్తు, నీటి ప్రాజెక్టులు, మెట్రో నిర్మాణాలన్నీ.. ఆనాడు ఎందరో ప్రజలు భూములిస్తేనే కదా? వాటి నిర్మాణాలు జరిగాయి అని గుర్తు చేశారు. ఈ వాస్తవాలను ప్రజలకు వివరించి రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూములివ్వాలని కోరాల్సిన కేటీఆర్.. స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని కోరడమంటే రాజ్యాంగ విరుద్ధమేనని బండి సుధాకర్ గౌడ్ అన్నారు.
Also Read; Telangana: జాతీయ రహదారులు ఎందుకు ఆలస్యమవుతున్నాయ్ ..?
రాష్ట్ర ఖజానా అంతా..
హైడ్రా(Hydraa) కూల్చివేతల వల్లగానీ, మూసీ నది ప్రక్షాళన, పునరుద్ధరణ వల్లగానీ నిర్వాసితులైన పేదలకు పక్కా ఇళ్లు కట్టి ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కారు సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు ప్రతిపక్షాల ఊబిలో చిక్కుకోవద్దన్నారు. రాష్ట్ర ఖజానా అంతా రాబందుల్లా దోచుకొని, సకల సంపదలూ కొల్లగొట్టిన బీఆర్ఎస్ నేతలకు నాయకుడైన కేటీఆర్ అధికారం కోల్పోయిన అక్కసుతో అబద్ధాలు వల్లెవేస్తూ గడుపుతున్నాడన్నారు. పదేళ్లు మీరే అభివృద్ధి చేశామంటున్నారు కదా.. మరి, ఇండ్లు లేని లక్షల మంది పేదలు ఇంకా ఎందుకున్నారని బండి సుధాకర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుకే సార్ధకత లేకుండా చేసిన కేటీఆర్ ఇంకా కలల లోకంలోనే విహరించకుండా, కిందకు దిగి వాస్తవాల్లో జీవించాలని సుధాకర్ గౌడ్ సూచించారు.