Uttam Kumar Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం – నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తాము అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు ముమ్మాటికి గోదావరి జల వివాద ట్రైబ్యునల్ 1980 అవార్డ్తో పాటు అంతరాష్ట్ర జల నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు. అసెంబ్లీలోని లాబీలో సోమవారం మంత్రి ఉత్తమ్ మీడియా చిట్చాట్లో మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్ రావు చూపిస్తున్న లేఖ సీడబ్ల్యూసీ అంతర్గతంగా సమాచారం కోసం పంపిన లేఖ మాత్రమేనని, అది సీడబ్ల్యూసీ ఆమోదించినట్లు కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర జల హక్కులపై ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు బీఆర్ఎస్ పార్టీ పూనుకున్నదని ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని కొట్టి పారేశారు.
సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం
పోలవరం-నల్లమల ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీఆర్ఎంబీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలతో పాటు కేంద్ర జల కమిషన్, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖలకు లేఖలు రాసిన విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభిప్రాయంతో పైన పేర్కొన్న సంస్థలన్నీ ఏకీభవించాయన్నారు. డిసెంబర్ 4న కేంద్ర జల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖనే ఇందుకు నిదర్శనమన్నారు. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. ఇదే ప్రాజెక్ట్ను ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఆక్షేపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడడంతో పాటు గట్టి వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్విని నియమించిందని పేర్కొన్నారు. నేడు జరగాల్సిన వాదనలు వచ్చే సోమవారానికి వాయిదా పడ్డాయని రిట్ పిటిషన్ను సూట్ పిటిషన్గా మార్చి దాఖలు చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు.
Also Read: Uttam Kumar Reddy: నదీ జలాలపై బీఆర్ఎస్ను ఏకిపారేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
నేనే స్వయంగా హాజరవుతా
వచ్చే సోమవారం జరగనున్న వాదనలకు స్వయంగా తాను హాజరవుతానని, మళ్లీ స్టే ఆర్డర్ కోరతామని తెలిపారు. ఇదే విషయమై రానున్న రెండు రోజుల్లో న్యాయవాదులతో ప్రత్యేకంగా మరో సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలువరించడంలో విజయం సాధించమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బ్రేక్ పడిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించుకోవాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం జల వనరుల నిర్వహణలో విఫలమైందని మంత్రి ఉత్తమ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పాలనలో మాటలకు చేతలకు ఎక్కడ పొంతన లేదని విమర్శించారు. జూరాల నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలానికి, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ను రీడిజైన్ చేయడం వంటి నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్ తరాల మీద మోయలేని భారాన్ని బీఆర్ఎస్ పాలకులు మోపారని మండిపడ్డారు.
Also Read: Uttam Kumar Reddy: తెలంగాణకు కేసీఆర్, హరీష్ రావు ద్రోహం చేశారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

