CM Revanth Reddy: తెలంగాణలో తమ ప్రభుత్వం ఇంటింటికి తిరిగి ప్రజల స్వీయ ధ్రువీకరణరణ పత్రంతో సేకరించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే దేశానికి రోల్ మోడల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)అన్నారు. సమగ్ర వివరాలతో క్షుణ్నంగా చేపట్టిన సర్వేకు సంబంధించి 88 కోట్ల పేజీల డేటా తమ వద్ద ఉన్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే చేపట్టిన తీరు పారదర్శకమైనదన్నారు. ఆ సర్వే ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు, విద్య, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతికి పంపించినట్లు తెలిపారు.
అయితే, పార్లమెంట్లో ఆమోదానికి ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress party) ఎంపీలకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సీఎం రేవంత్ (Revanth Reddy) సాయంత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడుతూ, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) కుల గణనకు హామీ ఇచ్చారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఫిబ్రవరి 4వ తేదీన సర్వేను ప్రారంభించి, 2025 ఫిబ్రవరి 5వ తేదీ నాటికి అంటే ఏడాది కాలంలో ఆ మొత్తాన్ని పూర్తి చేశామని సీఎం తెలిపారు.
అందుకే ఫిబ్రవరి 4ను తెలంగాణలో సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని సీఎం వెల్లడించారు. కులగణన చేపట్టే సమయంలో అనేక మంది అగ్ర కులాల నాయకులు తన వద్దకు వచ్చి అభ్యంతరాలు, సందేహాలు వ్యక్తం చేశారని, కాలానుగుణంగా మార్పులకు అవకాశం ఇవ్వాలని వారికి సూచించినట్లు సీఎం తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏళ్ల పాటు పోరాటాలు జరిగాయని, అనేక మంది అమరులయ్యారని, కానీ, 2009, డిసెంబరు 9న ప్రకటన చేయడంతో పాటు తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజల కలను సోనియా గాంధీ నెరవేర్చారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) గుర్తు చేసుకున్నారు. అదే తెలంగాణలో కుల గణనపై రాహుల్ గాంధీ (Rahul Gandhi)ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నెరవేర్చిందని సీఎం పేర్కొన్నారు.
బీజేపీ బీసీలకు వ్యతిరేకం.. కానీ గాంధీ కుటుంబం మాట నిలుబెట్టుకున్నది
ఇక బీజేపీ నాయకులు చెప్పినవి ఏవీ చేయరని, కానీ, గాంధీ కుటుంబం ఇచ్చిన ప్రతి మాటను నిలుబెట్టుకున్నదన్నారు. కుల గణనకు సంబంధించి తమ ప్రభుత్వం 56 ప్రశ్నలతో ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తి వద్దకు వెళ్లి సమాచారం సేకరించిందని, సర్వే సమయంలో అందుబాటులో లేనివారికి ఆన్లైన్ ద్వారా, టోల్ ఫ్రీ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సర్వే ప్రకారం తెలంగాణలో బీసీలు 56.36 శాతం ఉన్నారని సీఎం తెలిపారు. సర్వేలో 3.9 శాతం మంది తమది ఏ కులం కాదని ప్రకటించుకున్నట్లు తెలిపారు. ఇది తెలంగాణలో సరికొత్త పరిణామమని సీఎం చెప్పారు. పైగా వాళ్లంతా ఇంగ్లీష్ విద్యను అభ్యసించిన ఉన్నత విద్యావంతులు కావడం గమనార్హం అన్నారు.
రాహుల్ గాంధీ గళం
సర్వే ప్రకారం తాము స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు, విద్యా, ఉపాధి అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. బీజేపీ తొలి నుంచి బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని సీఎం విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లీగల్లీ కన్వెర్టెడ్ బీసీ అన్నారు. తాము కుల గణన చేపట్టమని రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో చెప్పారని సీఎం గుర్తు చేశారు. రైతుల నల్ల చట్టాల విషయంలో రాహుల్ గాంధీ గళం విప్పిన తర్వాత మోదీ వాటిని రద్దు చేసి క్షమాపణ చెప్పారని వివరించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట మేరకు తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టిన తర్వాత కేంద్రం కుల గణనకు అంగీకరించిందన్నారు.]
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
ఇదంతా రాహుల్ గాంధీ ఘనతేనని సీఎం కొనియాడారు. తాము చేపట్టిన సర్వే దేశానికి రోల్ మోడల్ అని, ఇది తెలంగాణ మోడల్ అని, తాను దీన్ని రేర్ మోడల్ అంటున్నానని చెప్పారు. రేర్ అంటే ఏమిటో నేను త్వరలో వివరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ హామీ మేరకు తమ ప్రభుత్వం కుల గణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, ఇక వాటిని లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదింపజేసేందుకు రాహుల్ గాంధీ, ఖర్గే నాయకత్వంలో పోరాడాలని ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తాను, తన మంత్రులు, శాసనసభ్యులతో జంతర్మంతర్లో పోరాడతానని, కూటమి ఎంపీలంతా పార్లమెంట్లో పోరాడాలని సీఎం కోరారు. ఇక కుల సర్వే, బీసీ బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ సోనియా గాంధీ స్వహస్తాలతో లేఖ రాశారని, ఆ లేఖ తనకు నోబెల్, ఆస్కార్, జీవితకాల సాఫల్య పురస్కారం (లైఫ్ టైమ్ అచీవ్మెంట్) అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈ స్థానంలోఉన్నా లేకున్నా ఆ లేఖ తనకు ప్రత్యేకంగా మిగిలిపోతుందని సీఎం పేర్కొన్నారు.
Also Read: Nagarkurnool district: నాగర్కర్నూల్ జిల్లాలో నయా మోసం.. అధికారులపై వేటు!
రేర్ అంటే?
సీఎం మదిలో ఏమున్నది త్వరలో చెబుతానని ప్రకటన
తెలంగాణ సర్వేను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రేర్ (RARE) మోడల్ అంటూ వివరించారు. సర్వే దేశానికి రోల్ మోడల్, తెలంగాణ మోడల్ కంటే తాను రేర్ మోడల్ అని పిలుస్తానని చెప్పారు. అయితే, రేర్ అంటే ఏమిటో త్వరలోనే వివరిస్తానని కూడా సీఎం క్లారిటీ ఇచ్చారు. దీంతో రేర్ అనే పదంలో ఏం ఉన్నదోనని, ఇటు ఆఫీసర్లు, పబ్లిక్ శోధించే పనిలో ఉన్నారు. సోషల్ మీడియాలోనూ పలు కామెంట్లు చేస్తున్నారు. రేర్ పదానికి పుల్ పామ్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
అయితే, ఎక్కువ మంది రేర్ అనే పదానికి ‘రాహుల్, రేవంత్ ’ అని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. మరి కొందరు రాహుల్ రీసెర్చ్ ఎన్ క్లోపిడియా అంటూ ఎక్స్ ప్లేన్ చేస్తున్నారు. ఇలా వివిధ రకాల వ్యక్తులు వేర్వేరు అర్ధాలు చెబుతూ సీఎం చెప్పిన పదానికి పుల్పామ్ను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, సీఎం మదిలో ఏం ఉన్నదనేది? ఉత్కంఠగా మారింది. స్వయంగా ఆయనే క్లారిటీ ఇస్తే కానీ రేర్ అనే పదంపై క్లారిటీ రాదని అధికారులు చెబుతున్నారు.
Also Read: Rahul Gandhi: తెలంగాణ దేశానికే మైలు రాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసలు