Minister Sridhar Babu: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ పార్కును అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) పేర్కొన్నారు. మహిళా సాధికారతను కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నామని ఆయన అన్నారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న లక్ష్యసాధనలో మహిళలను కీలక భాగస్వామ్యం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వీ హబ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘వీ ఎనేబుల్ గ్రాడ్యుయేషన్ వేడుక’లో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళా సాధికారత పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చాలంటే మార్పు అనేది ఇంటి నుంచే మొదలు కావాలని మంత్రి అన్నారు. 2017-18 నుంచి 2023-24 మధ్య కాలంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 22 శాతం నుంచి 40.3 శాతానికి పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు.
Also Read:Minister Sridhar Babu: మహిళలను ఉన్నత స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు
కొత్త ఆలోచనలకు సూచన
తెలంగాణలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 52.7 శాతం అని, ఇది జాతీయ సగటు 45.2 శాతం కంటే ఎక్కువగా నమోదు కావడం రాష్ట్ర పురోగతిని ప్రతిబింబిస్తోందన్నారు. మహిళలు కూడా పురుషులకు ధీటుగా వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తారని వీ హబ్ నిరూపించిందన్నారు. ఈ స్ఫూర్తితో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ప్రారంభించే స్టార్టప్లను అంతర్జాతీయ స్థాయిలో ఎంటర్ప్రైజెస్గా మార్చేలా ‘వీ హబ్ 2.0కు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ వేదిక ద్వారా ఒకేచోట స్కిల్స్, టెక్నాలజీ, ఫైనాన్స్, మార్కెట్, మెంటార్షిప్ వంటివి అందుబాటులో ఉండేలా సమగ్ర ‘ఎకో సిస్టం’ ను అభివృద్ధి చేస్తామన్నారు. మహిళలు ఉద్యోగాల కోసం కాకుండా, వాటిని సృష్టించేలా కొత్తగా ఆలోచించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారిణి జ్వాల గుప్తా, ఫిలిం ప్రొడ్యూసర్ ప్రియాంక దత్, వీహబ్ సీఈవో సీతా పల్లచోల్ల తదితరులు పాల్గొన్నారు.
Also Read: Minister Sridhar Babu: సక్సెస్ సాధించాలంటే.. టెక్నాలజీని సొంతం చేసుకోవాల్సిందే..!
