KTR: కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబితేనే వారిచ్చిన హామీలు అమలవుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించి కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలను నమ్మవద్దని హితవుపలికారు. తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రెండేళ్ల కిందట ఇలాంటి హామీలనే నమ్మి ప్రజలు మోసపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. పైసలు ఇస్తే తీసుకొని ఓటు మాత్రం బీఆర్ఎస్కు వేయాలని కోరారు. వారిచ్చే రెండు వేలు తీసుకొని మిగితా 58వేలు ఎప్పుడిస్తారని ప్రశ్నించాలంటూ ప్రజలకు సూచించారు. మరోవైపు.. దొంగ ఓట్లతో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Also Read: KTR: ప్రజారోగ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది..కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
బుల్డోజర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
ఇప్పటికే కాంగ్రెస్ 12, 13వేల దొంగ ఓట్లు సృష్టించినట్లు తెలుస్తోందని.. ప్రజలు స్వయంగా బూత్లకు వెళ్లి ఓటు వేసి వాళ్లకు బుద్ధి చెప్పాలన్నారు. ఇది కారుకు, బుల్డోజర్కు మధ్య జరుగుతున్న ఎన్నికలని.. బీఆర్ఎస్ను గెలిపించి బుల్డోజర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం, మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. రైతులు పండించిన ధాన్యం, పత్తి కొనుగోలు చేసే పరిస్థితే లేదని మండిపడ్డారు. అన్నదాతలకు బోనస్, పెట్టుబడి సాయం, విత్తనాలు, ఎరువులు కూడా అందట్లేదని అన్నారు. ఎరువుల కోసం లైన్లో నిలబడి రైతు చనిపోయిన దుస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.73వేల కోట్లు రైతుబంధు రూపంలో రైతుల అకౌంట్లు వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదైతే ఆ రైతుల గోస పట్టించుకోని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుద్యోగులను కూడా కాంగ్రెస్ మోసం
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను కూడా కాంగ్రెస్ మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఇచ్చినవి ఆరు, ఏడు వేల ఉద్యోగాలు కూడా లేవని ఎద్దేవా చేశారు. యువతులకు స్కూటీ, మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ మాట తప్పిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల ఇండ్ల జోలికి వెళ్లని హైడ్రా.. పేదల ఇల్లు కనిపిస్తే కూల్చివేస్తోందంటూ మండిపడ్డారు. మంత్రులు జూబ్లీహిల్స్లో గల్లీ లీడర్లలా తిరుగుతూ.. పాలనను పక్కన పెట్టేశారని ఫైరయ్యారు.
బీసీలను కాంగ్రెస్ సర్కార్ మోసం
మున్నూరు కాపులకు సముచిత గౌరవం, సముచిత ప్రాధాన్యం ఇచ్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ బీసీలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందని ఫైరయ్యారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తేనే ఇది జరుగుతుందని తాము ముందే చెప్పినా.. ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. కనీసం ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలనైనా అమలు చేయాలని హితవు పలికారు. బీసీలకు ఏడాదికి రూ.20వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడెందుకు ఇవ్వట్లేదో చెప్పాలని నిలదీశారు. బీసీలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
Also Read: KTR: మెడికల్ డివైస్ పార్క్ కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం: కేటీఆర్
ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలి.. బీఆర్ఎస్వీ నాయకుల డిమాండ్
విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే 8వేల కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగబాలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టారు. అందులో భాగంగానే హైదరాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించి అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు బిల్లులను విడుదల చేసిందని, కానీ 20లక్షల పైచిలుకు చదువుతున్న విద్యార్థులకు మాత్రం ఫీజు రియంబర్స్ బిల్లులు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. దీంతో విద్యార్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆస్తులను తాకట్టు పెట్టి కళాశాలల నుంచి సర్టిఫికేట్స్ తీసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందని మండిపడ్డారు. ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేసే వరకు మా పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీనాయకులు పాల్గొన్నారు.
