KTR: ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. రెండేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేయడం తప్ప నోటిఫికేషన్ ఇవ్వలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను మోసం చేసిన కాంగ్రెస్కి వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ లో ప్రచారం చేసుకున్న నిరుద్యోగ అభ్యర్థులను యువకులను దాడులతో అడ్డుకుంటుందన్నారు. జూబ్లీహిల్స్ బోరబండలో సోమవారం రోడ్ షో నిర్వహించారు. వినాయకనగర్, ఎస్సార్టీ నగర్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు.
Also Read: KTR: కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
గెలుపు పక్కా
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బోరబండలో వచ్చిన జనాన్ని చూస్తుంటే గెలుపు పక్కా అని తేలిపోయిందని,మెజార్టీ ఎంత అనేది తేలాల్సి ఉందన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తమకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగడుతున్న యువతీ యువకులపై దాడులు చేయడం దారుణమన్నారు. తన కుర్చీ కాపాడుకునేందుకు రాహుల్ గాంధీకి వందల కోట్లు పంపిస్తున్నారన్నారు. ఢిల్లీకి పంపేందుకు డబ్బులు ఉన్నాయి కానీ.. పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు డబ్బులు లేవా అని నిలదీశారు.
రియల్ ఎస్టేట్ను కూడా నాశనం
ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్నే కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందని.. ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగుతున్నారని.. కానీ అలా ఒక్క చాన్స్ ఇచ్చినందుకే.. నెంబర్ వన్గా ఉన్న తెలంగాణ చివరి ప్లేస్కు పడిపోయిందని అన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తేనే హైదరాబాద్ను భ్రష్టుపట్టించి.. రియల్ ఎస్టేట్ను కూడా నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఒక్క ఛాన్స్ అడుగుతున్నారని కాంగ్రెస్ ని నిలదీశారు.
ప్రజలు మరొక చాన్స్ ఇవ్వరు
ఇలాగే ఒక్క ఛాన్స్ అంటూ కంటోన్మెంట్ నియోజకవర్గలో గెలిచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మరోసారి జూబ్లీహిల్స్ ప్రజలను మోసం చేయడం కోసమే రేవంత్ రెడ్డి మరొక్క ఛాన్స్ అంటూ అడుకుంటున్నారని కానీ జూబ్లీహిల్స్ ప్రజలు మరొక చాన్స్ ఇవ్వరు అన్నారు. హింస, అరాచకత్వంతో రెచ్చిపోతున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పాల్సిన టైమ్ వచ్చిందన్నారు. కాంగ్రెస్ రౌడీయిజానికి జూబ్లీహిల్స్ నుంచే ప్రజలు చరమగీతం పాడబోతున్నారని తెలిపారు.
రౌడీల సంగతి తేలుస్తాం
ఇక్కడ ఎవరైన బెదిరింపులకు దిగితే బాధితులకు అండగా ఉండి.. రౌడీల సంగతి తేలుస్తామని ఆయన హెచ్చరించారు. ఇక.. అధికారంలోకి రావడానికి నోటికొచ్చిన హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ఫైరయ్యారు. బుల్డోజర్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోందని మండిపడ్డారు. హైడ్రా, బుల్డోజర్లు పేదల ఇంటిపైకి రాకూడదంటే.. హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే.. మాగంటి సునీతను గెలిపించాలని కోరారు.
Also Read: KTR: జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

