KTR: కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణలోని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారని, గులాబీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోనే మొదలవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ దివాలా తీసింది, ఎయిడ్స్ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్ అంటూ సీఎం రాష్ట్రం పరువు తీస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ భవన్ లో సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ స్థాయి బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి ఒక్క పైసా కూడా లేదని డిప్యూటీ సీఎం చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. విద్యార్థుల ఫీజుల కోసం లేని డబ్బులు, కమీషన్లు, కాంట్రాక్టులకు మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రభుత్వం చెప్పాలనిడిమాండ్ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తాము 20 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులను చెల్లించామన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డబ్బులు లేవన్న సాకుతో పెండింగ్ బకాయిలను ఇవ్వడం లేదని విమర్శించారు. డబ్బులన్నీ ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలకే ఖర్చు అవుతున్నాయని రీ యింబర్స్ మెంట్ కు ఒక్క పైసా కూడా లేదని డిప్యూటీ సీఎం చెప్పడం సిగ్గుచేటన్నారు. కాలేజీల బంద్ను ఆపి వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Also Read: Handshake controversy: అతడిని తొలగించండి.. భారత్తో మ్యాచ్పై ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు
యూరియాను కాంగ్రెస్ నాయకులే బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు
రాష్ట్రంలో యూరియా కొరత, సంక్షోభానికి కాంగ్రెస్ నే ప్రధాన కారణమన్నారు. రైతుల కోసం కేటాయించిన యూరియాను కాంగ్రెస్ నాయకులే బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ పేరు ఉందన్న ఏకైక కారణంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు. కేసీఆర్ కిట్లు, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాలు అన్నింటినీ ఆపేశారని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ నాయకులు అందినకాడికి దోచుకుతింటున్నారని మండిపడ్డారు. అప్పులు చేయకుండా ఆదాయం పెంచి పాలన చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్న కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిన 24 నెలల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.
క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది
ప్రభుత్వ నిర్వాకంతో ఊర్లలో అత్తా, కోడళ్ల మధ్య కొత్త పంచాయతీలు మొదలయ్యాయన్నారు. హైదరాబాద్లో పట్టపగలే దోపిడీలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై ప్రేమ ఉంటే వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు మంత్రులు పోవాలి కాని ఉప ఎన్నికల ప్రచారంలో తిరగొద్దని సూచించారు. కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పీజేఆర్, కేసీఆర్ పోరాట స్ఫూర్తితో బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపు నిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వేల మంది ఇళ్లను కూలగొట్టింది
జీవో నెంబర్ 58, 59 కింద లక్ష మందికి కేసీఆర్ పట్టాలిచ్చారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వేల మంది ఇళ్లను కూలగొట్టిందనిఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు ఇవ్వకుండా మోసం చేసినందుకు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గోస పెడుతున్నందుకు, హైదరాబాద్ను ఆగం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి జూబ్లిహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ లో ఘన విజయం సాధించి మాగంటి గోపినాథ్ కు నివాళి అర్పించాలని కోరారు.
Also Read: Adwait Kumar Singh: రోగులకు మెరుగైన వైద్యం అందించాలి.. జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కీలక అదేశాలు