KTR on CM Revanth Reddy: 20 నెలల తన పాలన చూపించి ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము రేవంత్ రెడ్డికి(Revanth Reddy) ఉందా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సవాల్ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆదివారం పాల్గొని మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని సవాల్ విసిరారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని ప్రశంసించారు. కాంగ్రెస్ నాయకుల బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా(Hydraa) పనిచేస్తుందని ఆరోపించారు. హైడ్రా అరాచకాలతోనే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిందని విమర్శించారు. బీఆర్ఎస్(BRS) పదేళ్ల పాలనలో చేసిన అప్పుల కంటే ఎక్కువ అప్పులను కేవలం 20 నెలల కాలంలోనే చేసిన రేవంత్ రెడ్డికి, తాను చేసిన అభివృద్ధిని చెప్పుకునే దమ్ముందా అని నిలదీశారు.
జనరేటర్లను కనిపించకుండా చేశా
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందన్నారు. 2014లో గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం అయిన ఆరు నెలల్లోనే తీవ్ర విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించి, ఇళ్లలో, షాపులలో కనిపించే ఇన్వర్టర్లు, జనరేటర్లను కనిపించకుండా చేశారని చెప్పారు. హైదరాబాద్ ను కులం, మతం, ప్రాంతం పేరు మీద రాజకీయాలు చేయకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపించామన్నారు. దసరా కానుకలు, ముస్లింలకు రంజాన్ తోఫా, క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్టులు ఇచ్చి పండుగలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. తెలంగాణకు గుండెకాయగా హైదరాబాద్ ను కేసీఆర్ మార్చారన్నారు.
Also Read: Jogulamba Gadwal: గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూల్ల దుర్మార్గాలు.. ఫీజుల కోసం విద్యార్థులపై దాడులు
ఆర్ఆర్ టాక్స్ పేరుతో వసూళ్లు
హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ నగర వృద్ధి అతలాకుతలమైందని తీవ్రంగా ఆరోపించారు. పేదల ఇళ్లు కూలగొడుతున్న హైడ్రా, పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్((Congress) నేతల బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా పని చేస్తుందని ఆరోపించారు. పేదవాళ్ల కడుపు కొట్టడం, బిల్డర్లను బెదిరించడం, ఆర్ఆర్ టాక్స్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎన్నడూ రియల్ ఎస్టేట్లో నాయకులు వేలు పెట్టలేదని, కబ్జాలు, గూండాగిరి చేయలేదని స్పష్టం చేశారు. కానీ 20 నెలల్లోనే హైడ్రా పేరుతో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టించారని దుయ్యబట్టారు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకోకుండా పేదల ఇళ్లు కూల్చివేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్లలో రెండు లక్షల 85 వేల కోట్ల అప్పు చేస్తే, రేవంత్ రెడ్డి 20 నెలల్లోనే రెండు లక్షల 20 వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు.
తమ సొంత లాభం కోసమే
కేసీఆర్ ఆ అప్పుతో హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు, అత్యాధునిక ఆసుపత్రులు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించారని, కానీ రేవంత్ ఒక్క కొత్త బ్రిడ్జి కానీ, మోరీ కానీ కట్టిండా అని ప్రశ్నించారు. కేసీఆర్ 70 లక్షల మంది రైతు ఖాతాల్లో 70 వేల కోట్లు వేస్తే, రెండు లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ ఏం చేశారని నిలదీశారు. 200 ఉన్న పెన్షన్ ను కేసీఆర్(KCR) ప్రభుత్వం 2000 చేస్తే, రేవంత్ ఏం చేసిండని అడిగారు. శేరిలింగంపల్లితో పాటు పార్టీ మారిన మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాకుండా, తమ సొంత లాభం కోసమే కాంగ్రెస్ లోకి వెళ్లారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసి ఉంటే, ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. టైంపాస్ ముచ్చట్లు చెబుతూ, ఒకరోజు కేసీఆర్ మీద, ఇంకోరోజు తన మీద కేసులంటూ రేవంత్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మహానగరానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదన్నారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదల్లేదని పేర్కొన్నారు.
Also Read: Suryapet: మార్వాడీ మాఫియాను అరికట్టాలి.. ఆ జిల్లాలో వ్యాపారుల ఆందోళన