HC on KCR’s Petition: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్(Justice P.C. Ghosh Commission) ఇచ్చిన నివేదికను కొట్టి వేయాలంటూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)లకు చుక్కెదురైంది. పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించిన విషయం తెలిసిందే. కమిషన్ దాదాపు పదమూడు నెలలపాటు వందలాది మందిని విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పాలు పంచుకున్న ఇంజనీర్లు, ఇతర అధికారుల నుంచి అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలాలు సేకరించింది. మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రులు హరీష్ రావు(harish Rao), ఈటల రాజేందర్ లను విచారించి వారి నుంచి కూడా వివరాలు రాబట్టింది. అనంతరం నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందించింది. దీంట్లో ప్రాజెక్ట్ నిర్మాణానికి కర్త, కర్మ, క్రియ అంతా కేసీఆర్ అని స్పష్టమైంది.
నివేదికను కొట్టి వేస్తూ ఉత్తర్వులు జారీ
కాగా, ఈ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసీఆర్, హరీష్ రావులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. కమిషన్స్ ఎంక్వయిరీ యాక్ట్ సెక్షన్ 8బీ ప్రకారం తమకు నోటీసులు ఇవ్వకుండానే నివేదికను బహిర్గతం చేశారని తమ పిటిషన్లలో పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనకు కావాల్సినట్టుగా ప్రభుత్వం నివేదికను తయారు చేయించినట్టుగా తెలుస్తోందన్నారు. ఇదంతా కేసీఆర్(KCR) ప్రతిష్టను దెబ్బ తీయటానికే చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ పై కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టి వేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. శుక్రవారం మరోసారి విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కమిషన్ నివేదికను పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఉంటే వెంటనే దానిని తొలగించాలని పేర్కొంది. పిటిషనర్లు కోరినట్టుగా స్టే ఇవ్వలేమని పేర్కొంది.
Also Read; Urea Shortage: తొర్రూరులో యూరియా కోసం.. కాళ్లు పట్టుకున్న రైతులు
శుక్రవారం వాదనలు
కేసీఆర్, హరీష్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం కూడా వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెడతామని చెప్పారు. దీనిపై చర్చ జరిగిన అనంతరం బాధ్యులపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాగా, పిటిషనర్ల తరపు వాదనలు వినిపించిన న్యాయవాది సుందరం మొత్తం కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని కోరారు. నివేదికను అడ్డం పెట్టుకుని తమ పిటిషనర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరుతున్నామన్నారు. కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టక ముందే మీడియాకు ఇచ్చి పిటిషనర్ల పరువుకు భంగం కలిగించారని చెప్పారు. సెక్షన్ 8బీ, 8సీ కింద నోటీసులు ఇవ్వని విషయాన్ని మరోమారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమయంలో హై కోర్టు న్యాయమూర్తులు జోక్యం చేసుకుని సెక్షన్ 8బీ ప్రకారం కాకుండా సెక్షన్ 5(1) ప్రకారం నోటీసులు ఎందుకు ఇచ్చారంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. దీనికి అడ్వకేట్ జనరల్ సమాధానంగా తాము ఇచ్చింది 8బీ నోటీసు లాంటిదేనని తెలిపారు. నివేదికను అసెంబ్లీలో పెట్టటానికి ఆరునెలల సమయం ఉందని చెప్పారు.
Also Read: HBD Chiranjeevi: నాడు దేశంలో ఎక్కువ రెమ్యూనరేషన్ హీరో.. అమితాబ్ కూడా అందుకోలేని పారితోషికం