Harish Rao: తెలంగాణలో విద్యా వ్యవస్థను, విశ్వవిద్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. చదువులకు నిలయమైన యూనివర్సిటీల్లో రియల్ దందా చేస్తూ, భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీల భూములను టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే భవనాలు కట్టడం కాదు, భావితరాలకు జ్ఞానాన్ని అందించే పరిశోధనా కేంద్రాలను కాపాడుకోవడం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘‘మొన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి బలవంతంగా 100 ఎకరాలకు పైగా భూములను లాక్కున్నారు. 60 ఏళ్లుగా ఎంతో కష్టపడి కాపాడుకుంటూ వస్తున్న ఔషధ, సుగంధ మొక్కల పరిశోధనా కేంద్రం లోని 60 ఎకరాలను పూర్తిగా ధ్వంసం చేశారు.
Also Read: Harish Rao: పాలమూరు ప్రాజెక్ట్పై ఒక్క అనుమతైనా తెచ్చారా? ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్!
ఎంతో విలువైన పరిశోధనా సంపద నేలమట్టమైంది’ అని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలకు పైగా అటవీ భూమిని తాకట్టు పెట్టి విధ్వంసం చేశారని, దీనివల్ల అక్కడి పర్యావరణ వ్యవస్థ చిన్నాభిన్నం కావడమే కాకుండా, మూగ జీవాల మనుగడకే ముప్పు వాటిల్లిందన్నారు. ఇప్పుడు మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందిన 50 ఎకరాలపై ప్రభుత్వం కన్ను పడిందని హరీశ్ రావు ఆరోపించారు. అదే పద్ధతిలో ఇక్కడి భూములను కూడా లాక్కోవాలని చూస్తున్నదని ఇవి ఏవో యాదృచ్చికంగా జరిగిన సంఘటనలు కావని అన్నారు. విద్యా వ్యవస్థపై, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిపై జరుగుతున్న ఉద్దేశపూర్వక దాడిగా పేర్కొన్నారు.
ఎందుకంత చిన్నచూపు
ప్రభుత్వానికి విద్యార్థులన్నా, పరిశోధనలన్నా, పర్యావరణమన్నా ఎందుకంత చిన్నచూపు అంటూ ప్రశ్నించారు. భవిష్యత్ తరాలకు జ్ఞానాన్ని అందించాల్సిన చోట, ఆవిష్కరణలకు ఊపిరి పోయాల్సిన చోట, ఇలా భూములను లాక్కోవడం దేనికి సంకేతం అని అడిగారు. విద్యా సంస్థల భూములను కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లలా చూస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ భవిష్యత్తును నిర్మించాల్సింది పోయి ఉన్న విజ్ఞాన కేంద్రాలను బుల్డోజర్లతో కూల్చడం సిగ్గుచేటు అని, ప్రభుత్వం వెంటనే ఈ చర్యలను ఆపాలని డిమాండ్ చేశరు. యూనివర్సిటీల భూములను వాటికే వదిలేయాలని, లేదంటే విద్యార్థి లోకం, తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హరీశ్ రావు హెచ్చరించారు.
Also Read: Harish Rao: పొమ్మనలేక పొగ పెట్టే ప్రయత్నం? పార్టీలో కీలక నేతగా ఎదిగితే గెంటేయడమేనా?

