Harish Rao: ‘క్యాబినెట్ లో ఉన్న మంత్రులు ఒకటి కాదు, రెండు కాదు అరడజను వర్గాలుగా చీలిపోయారు.. ఒకరంటే ఒకరికి పడుతలేదు.. సీఎం, మంత్రులు.. పాలన గాలికి వదిలి పర్సనల్ పంచాయతీలు పెట్టుకుంటున్నరు.. కమీషన్ల కోసం ఒకరు, కాంట్రాక్టుల కోసం ఒకరు, వాటాల కోసం ఒకరు, కబ్జాల కోసం, పోస్టింగుల కోసం ..ఇది మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు.. దండుపాళ్యం ముఠా లెక్క ఉంది’ అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి దాంట్లో కొట్లాటలే.. ఆ మంత్రి ఈ మంత్రిని తిట్టుడు, ఈ మంత్రి ఆ మంత్రి తిట్టుడు ఇదే సరిపోయింది.. అతుకుల బొంతగా ఉన్న ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతదో అని స్వయంగా మంత్రులే భయపడుతున్నరు.. దీపం ఉండంగనే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో అధికారంలో ఉన్నపుడే అందినకాడికి దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యాబినెట్ మీటింగ్ లో ప్రజలకు సంబంధించిన అంశాల గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడుతారు అనుకున్నామన్నారు. దసరాకు మొండి చేయి చూపారు, దీపావళి కానుకగా ప్రజలకు ఏదైనా తీపి వార్త చెబుతరేమో అనుకున్నామని కానీ తీవ్ర నిరాశే మిగిలిందన్నారు. క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి, మంత్రుల పంచాయతీ పెట్టుకున్నారని దుయ్యబట్టారు. మంత్రుల పంచాయితీలు తెంచుకోవటానికే క్యాబినెట్ మీటింగ్స్ అని దుయ్యబట్టారు.
కేంద్రం ఎందుకు మౌనం
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై క్యాబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలపై కేంద్రదర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టే సంస్కృతిని రేవంత్ తీసుకొచ్చారని ఆరోపించారు. కేంద్రం స్పందించకుంటే కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) మధ్య సంబంధం ఉందని భావించాల్సి ఉంటుందన్నారు.
Also Reada: Raja Singh: బీజేపీలో బీసీలు ఎక్కడున్నారో కిషన్ రెడ్డి చెప్పాలి.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించే పరిస్థితులు వచ్చాయని, రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది? కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi sanjay) లు ఎందుకు నోరు మెదపటం లేదు?అని ప్రశ్నించారు. దీనిపై లీగల్ గా ముందుకెళ్తామన్నారు. ఏ ఏజెన్సీలకు సంస్థలకు ఫిర్యాదు చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అతుకుల బొంతగా తయారైంసని స్వయానా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారన్నారు. 23నెలల్లో ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుతారు? అని నిలదీశారు.
ప్రభుత్వ పాలనలో అప్పులు
పారిశ్రామికవేత్తలు, సినిమా ఇండస్ట్రీ, కాంట్రాక్టర్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారని మండిపడ్డారు. హ్యామ్ మోడల్ పై బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం వచ్చాక విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. హ్యామ్ మోడల్ బోగస్.. కమిషన్లు దండుకోవటానికే హ్యామ్ మోడల్ అంటున్నారని మండిపడ్డారు. 10,547 కోట్లతో టెండర్లు పిలిచి, బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి కమీషన్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రేవంత్ ప్రభుత్వ పాలనలో అప్పులు కుప్పగా రాష్ట్రం తయారైందన్నారు.
పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, సినిమా పెద్దలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు భయపడొద్దు.. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి.. మిమ్మల్ని కాపాడుకుంటాం.. రాష్ట్రాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఓపెన్ గా టెండర్లు వేయవద్దని బెదిరిస్తుంటే.. తుపాకులు పట్టుకొని తిరుగుతుంటే ఇది డీజీపీకి కనబడటం లేదా? అని ప్రశ్నించారు. డీజీపీ పింక్ బుక్ లేదు.. రెడ్ బుక్ లేదు.. అంతా ఖాకీబుక్కే ఉందని అన్నాడుకదా? ఆ ఖాకీ బుక్ లో ఇవి లేవా? శివధర్ రెడ్డికి కనబడటం లేదా? రూల్స్ అందరికి ఒకటే ఉండవా? అని నిలదీశారు.
