BRS Party: గులాబీ నేతల పనితీరుపై అధిష్టానం ఆరా తీస్తుంది. నియోజకవర్గాల్లో ప్రజాసమస్యలపై పార్టీ నేతలు స్పందిస్తున్నారా? ప్రజల పక్షాన ఉంటున్నారా? ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారా? పార్టీ పటిష్టంగా ఉందా? అనేవివరాలను సేకరిస్తున్నారు. పార్టీలో యాక్టీవ్ గా పనిచేస్తున్న నేత వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిన వారిని కేసీఆర్ అభినందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయాక నేతల్లో కొంత నైరాశ్యం నెలకొంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు ఆశలుపెట్టుకున్నారు. అయితే హామీలు, గ్యారెంటీల అమలులో కొంత జాప్యం జరుగుతుండటంతో ప్రజల్లో నైరాశ్యం నెలకొంది. ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు స్టార్ట్ అయ్యాయని భావించిన గులాబీ ఆ అవకాశాన్ని చేజార్చుకోవద్దని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుంది.
Also read: Sarasvati Pushkaralu: పుష్కరాలకు ప్రత్యేక అధికారులు.. పారిశుధ్య లోపం తలెత్తకుండా చర్యలు!
అందులో భాగంగానే నేతలను సమస్యలపై మాట్లాడాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. సందర్భాను సారంగా నేతలు మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. అయితే ఆశించిన స్థాయిలో నేతల నుంచి స్పందన రావడం లేదని భావించిన పార్టీ అధిష్టానం నియోజకవర్గాల వారీగా నేతల తీరును ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఏ నియోజకవర్గంలో నేతలు సమస్యలపై ఎలా స్పందిస్తున్నారు?.. యాక్టీవ్ గా ఉన్న లీడర్ ఎవరు? ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తున్నారు… గెలిచిన ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని ఆరా తీస్తున్నట్లు సమాచారం. భవిష్యత్ లో పార్టీ వారికి పార్టీ కమిటీల్లో అవకాశం ఇస్తే ఎలా ముందుకు తీసుకెళ్తారు? పార్టీని పటిష్టం చేయగలరా? అనే అంశాలను సైతం సేకరిస్తున్నట్లు తెలిసింది.
అదేవిధంగా తెలంగాణ భవన్ కు వస్తున్న నేతల వివరాలను సైతం పార్టీ అధిష్టానం సేకరిస్తున్నట్లు తెలిసింది. పార్టీకి ఫుల్ టైమర్లుగా పనిచేస్తున్న నేతల పనితీరును సైతం ఆరా తీస్తున్నట్లు సమాచారం. భవన్ కు వచ్చిన నేతలు ఏం చేస్తున్నారు? వచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రెస్ మీట్లు పెడుతున్నారా? లేకుంటే వ్యక్తిగత పనుల కోసం వస్తున్నారా? నియోజకవర్గ సమస్యలపై గానీ, పార్టీ నాయకుల సమస్యల పైన గానీ వస్తున్నారా? లేకుంటే కాలయాపన కోసం వస్తున్నారా? అనే వివరాలను సైతం సేకరిస్తున్నట్లు తెలిసింది.
భవన్ ఇన్ చార్జీ, పనిచేస్తున్న సిబ్బంది నుంచి సైతం వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. నేతల పనితీరులో మార్పుకోసం ఏం చేయాలి అనే సూచనలు సైతం స్వీకరిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో హెచ్సీయూపై అనుసరించిన విధానాలను, తాజాగా సీఎం రాష్ట్రం దివాలా తీసిందనే కామెంట్ పై నేతలు స్పందించిన తీరుపై కేసీఆర్ అభినందించినట్లు సమాచారం.
Also read: Uttam Kumar Reddy: యుద్ధానికి నేను రెడీ.. పాకిస్థాన్ కు బుద్ధి చెప్పాల్సిందే!
వరంగల్ సభ సక్సెస్ తర్వాత నేతల్లో, పార్టీ కేడర్ లో, ప్రజల్లో ఏమేరకు గ్రాఫ్ పెరిగింది.. బీఆర్ఎస్ పై ప్రజలు ఏమనుకుంటున్నారనే వివరాలను సైతం సేకరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంపై ఏమేరకు వ్యతిరేకత వచ్చిందనే వివరాలను గ్రౌండ్ లెవల్ రిపోర్టును సేకరిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలపై కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పార్టీలో రాబోయే కాలంలో వేసే కమిటీల్లో యాక్టీవ్ గా పనిచేసే నేతలకు చోటు కల్పించనున్నట్లు తెలిసింది. ఇప్పటి నుంచే పార్టీ నేతల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.