KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని బీఆర్ఎస్(BRS) ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత(Maganti Sunitha) పోటీ చేస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అధికారికంగా ప్రకటించారు. పార్టీ నేతలు, కేడర్ గెలుపునకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ భవన్ లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ బూత్ స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. రేపటి తెలంగాణ భవిష్యత్తును జూబ్లీహి(Jublihills)ల్స్ ఉప ఎన్నిక డిసైడ్ చేస్తుందన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ లో గులాబీ జైత్రయాత్ర తోనే సురుకు పెట్టాలన్నారు.
కారు కావాలో కాంగ్రెస్ కావాలో
పొరపాటున కాంగ్రెస్ ను గెలిపిస్తే సంక్షేమ పథకాలను అమలుచేయాల్సిన అవసరం తమకు లేదని ఆ పార్టీ నాయకులు భావిస్తారని చెప్పారు. కారు కావాలో కాంగ్రెస్(Cngress), బీజేపీ(BJP) బేకార్ గాల్లు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. తెలంగాణ రక్షగా, గొంతుగా ఉన్న కేసీఆర్ ను లేకుండా చేయాలన్నదే బీజేపీ, కాంగ్రెస్ ఉమ్మడి లక్ష్యం అన్నారు. బీఆర్ఎస్ ని ఖతం చేస్తే కాంగ్రెస్ ను ఈజీగా ఫుట్ బాల్ ఆడుకోవచ్చని బీజేపీ భావిస్తుందన్నారు. రేవంత్ ప్రభుత్వం చేసిన మోసంతో రాష్ట్రంలో ఏ ఒక్క ఆడబిడ్డ సంతోషంగా లేదని, గీతక్క ,సీతక్క ,సురేఖ అక్క లు మాత్రమే సంతోషంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ ప్రభుత్వం అని విమర్శించారు.
వక్ఫ్ సవరణలను దేశంలో..
రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఓట్ చోర్ అంటున్న మోడీని, మోసగాడనే అదానీని రేవంత్ వెనుకేసుకొస్తున్నాడని చెప్పారు. సీబీఐ(CBI)ని కేసీఆర్ మీద ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని ముస్లీంల మనోభావాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం చేసిన వక్ఫ్ సవరణలకు వ్యతిరేకంగా రాజ్యసభలో బీఆర్ఎస్ ఓటు వేసిందన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణలను దేశంలో అందరి కంటే ముందు రేవంత్ ప్రభుత్వమే అమలు చేసిందని గుర్తుచేశారు. ఇలా ఎందుకు చేశారో చెప్పాలని ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ మంత్రులు, నేతలను ముస్లీంలు నిలదీయాలని పిలుపునిచ్చారు. చరిత్రలో తొలిసారి ముస్లీం మంత్రి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందన్నారు. కేసులకు భయపడితే లీడర్లు కాలేరని, న్యాయం కోసం ధర్మం కోసం కొట్లాడాలి, 420 హామీల అమలు ఎప్పుడు అని కాంగ్రెస్ నేతలను ఎక్కడికిక్కడ నిలదీయండి అని పిలుపు నిచ్చారు.