Jagannath Rath Yatra: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో (Jagannath Rath Yatra) ఆదివారం తెల్లవారు జామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 9 రోజుల బస కోసం జన్మస్థానమైన గుండీచా ఆలయానికి విచ్చేసిన దేవతామూర్తులు జగన్నాథ్, బలభద్రుడు, సుభద్ర దేవీలను రథాలపై ఊరేగిస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగింది. దేవతామూర్తులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తోపులాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో 50 మంది వరకు భక్తులకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
రథయాత్రను వీక్షిస్తూ కొందరు భక్తులు కిందపడటంతో తొక్కిసలాటకు దారితీసినట్టుగా తెలుస్తోంది. మృతులను ప్రభతిదాస్, బసంతీ సాహు, ప్రేమకాంత్ మొహంతీగా అధికారులు గుర్తించారు. ఒడిశాలోని ఖుర్దా జిల్లాకు చెందినవారని చెప్పారు.
Read Also- Viral News: ప్రియుడితో కలిసి.. భర్త కళ్లలో కారం కొట్టి..
కలెక్టర్ ఏమన్నారంటే?
తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనపై పూరీ కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్ మాట్లాడారు. పోస్టుమార్టం కోసం డెడ్బాడీలను హాస్పిటల్కు తరలించామని, మృతికి గల కారణం ఏంటనేది శవపరీక్షలో బయటపడుతుందని అన్నారు. భద్రత విషయంలో తగిన ఏర్పాట్లు చేయలేదన్న వాదనలో నిజం లేదని అన్నారు. పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశామని, అయితే, భక్తులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో తరలి రావడం విషాదానికి దారితీసిందని కలెక్టర్ వివరించారు.
Read also- Star Actress: ఆ నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
ఈ విషాదంపై ఒడిశాలో రాజకీయ రగడ చెలరేగింది. బీజేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భయంకరమైన విషాదం’గా ఆయన అభివర్ణించారు. ‘‘ఇప్పుడు మనం చేయగలిగేది ఒక్క ప్రార్థన మాత్రమే. ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఇంతటి విషాదానికి బాధ్యులైన మహాప్రభు జగన్నాథుడు క్షమించాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. నవీన్ పట్నాయక్ వ్యాఖ్యలను ఒడిశా న్యాయ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తప్పుబట్టారు. బీజేడీ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గతంలో, బీజేడీ ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసింది. జగన్నాథుడిని కూడా అవమానించింది’’ అని ఆయన కౌంటర్ ఇచ్చారు.
కాగా, పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు, బలభద్రుడు, శుభద్ర దేవీ దేవతామూర్తుల విగ్రహాలను మూడు పవిత్ర రథాలపై ఊరేగింపుగా గుండిచా ఆలయానికి తీసుకువెళతారు. తిరిగి జగన్నాథ ఆలయానికి వెళ్లడానికి ముందు అక్కడ విశిష్టపూజలు అందుకుంటారు.