Modi Sindoor Plant: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసం ‘7 లోక్ కల్యాణ్ మార్గ్’లో ఒక సింధూరం మొక్కను (Modi Sindoor Plant) నాటారు. 1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధ (1971 India-Pakistan Conflict) సమయంలో అసామాన్యమైన పరాక్రమం ప్రదర్శించిన కచ్ ప్రాంతానికి చెందిన మహిళ ఒకరు తనకు ఈ మొక్కను అందించారని మోదీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ 1971 యుద్ధ సమయంలో గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందిన మాతృమూర్తులు, సోదరీమణులు ధైర్యానికి, శౌర్యానికి ప్రతీకగా నిలిచారు. ఈమధ్య నేను గుజరాత్ పర్యటనకు వెళ్లినప్పుడు ఒక మాతృమూర్తి ఈ సింధూరం మొక్కను అందజేశారు. ఇవాళ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో మొక్క నాటడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. మన దేశ మహిళల శౌర్యానికి, స్ఫూర్తికి ఈ మొక్క బలమైన ప్రతీకగా నిలుస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మొక్క నాటుతున్న రెండు ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు. కాగా, సింధూరం మొక్క నాటేందుకు ప్రధాని మోదీ స్వయంగా తానే గుంతను సిద్ధం చేశారు. మొక్క నాటాక నీళ్లు పోశారు.
Read this- ISI Network Exposed: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ ఐఎస్ఐ గుట్టురట్టు
ఉగ్రదాడి నేపథ్యంలో ప్రాధాన్యత
ఏప్రిల్ నెలలో జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. హిందూ మహిళల ముందే వారి భర్తలను కర్కశంగా కడతేర్చారు. దీంతో, బాధిత హిందూ మహిళలకు నుదుటన సింధూరం దూరమైంది. తీవ్ర ఉద్రిక్తత రాజేసిన ఈ ముష్కర ఘటనకు ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నక్కివున్న ఉగ్రవాదులే లక్ష్యంగా వరుస దాడులతో విరుచుకుపడింది. ఆపరేషన్ విజయవంతమైన తర్వాత, బీహార్లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ‘నా నరనరాల్లో ప్రవహించింది రక్తం కాదు, సింధూరం’ అని వ్యాఖ్యానించారు. సింధూరం గన్పౌడర్గా మారితే పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయో శత్రువులకు అర్థమైందనుకుంటానని ఆయన హెచ్చరించారు.
Read this- DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం కన్నీటి పర్యంతం.. ఎందుకంటే?
సింధూరం మొక్క ప్రత్యేకత ఏమిటి?
భారతదేశంలో సింధూరం మొక్కకు మతపరమైన, సాంస్కృతిక, ఔషధ ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మొక్కను దేశంలోని పలు ప్రాంతాల్లో ‘అన్నట్టో’, ‘బిక్సా’ అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ‘రెడ్-ఆరెంజ్’ వర్ణాన్ని సింధూరం తయారీలో కూడా వినియోగిస్తుంటారు. హిందూ మహిళలు పవిత్ర తిలకంగా దిద్దుకునే సింధూరం పొడిని కూడా తయారు చేస్తారు. హిందూ మహిళలు తమ వైవాహిక స్థితిని, భర్తపై ప్రేమను చాటిచెప్పేందుకు నుదుటన సింధూరాన్ని దిద్దుకుంటారు. సింధూరం మొక్క విత్తనాల నుంచి ఈ రంగును సేకరిస్తారు. సహజసిద్ధమైన రంగు కావడంతో చర్మ సౌందర్య ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీయాక్సిడెంట్స్లలో ఉపయోగిస్తారు. చర్మ సమస్యలతో పాటు అజీర్తికి సంబంధించిన సమస్యల చికిత్సలో కూడా సింధూరం మొక్కలను వినియోగిస్తుంటారు.