– ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని వ్యాఖ్యలు
– రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తున్నా
– దళిత, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలు ఖాయం
– జహీరాబాద్ ఎన్నికల సభలో మోదీ కామెంట్స్
Modi about Muslim Reservations(Political news telugu): బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తోందనే ప్రచారం దేశంలో సాగుతున్న వేళ ప్రధాని మోదీ దీనిపై స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిమిత్తం మంగళవారం జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని అల్లాదుర్గం వద్ద ఏర్పాటు చేసిన సభకు ప్రధాని హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కాపాడుతానని, దళిత, ఓబీసీలకు రాజ్యాంగం పూచీపడిన రిజర్వేషన్లను అమలయ్యేలా చూస్తానన్నారు. అదే సమయంలో తాను బతికి ఉన్నంతవరకూ రాజ్యాంగ వ్యతిరేకమైన ముస్లిం రిజర్వేషన్లు అమలయ్యే ప్రసక్తే లేదని మోడీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగం విషయంలో మోదీకి ఉన్న చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. తనను శంకించే, అవమానించే వ్యక్తులను దేశ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. సవరణల పేరుతో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, నేడు తనపై వ్యాఖ్యాలు చేస్తున్న ఆ పార్టీ నేతలు సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read: జీహెచ్ఎంసీ ఖజానాకు కాసుల గలగల
బీజేపీకి రాజ్యాంగమే ధర్మ గ్రంథమని తేల్చి చెప్పిన ప్రధాని.. గుజరాత్ సీఎంగా తాను రాజ్యాంగాన్ని ఏనుగు అంబారీపై ఊరేగించానని, ఆ సమయంలో తాను కింద నడుచుకుంటూ వెళ్లానని గుర్తుచేశారు. పార్లమెంట్లో అడుగుపెట్టిన రోజే రాజ్యాంగానికి కట్టుబడ్డానని, అది తనకు రామాయణం, బైబిల్, ఖురాన్తో సమానమని స్పష్టం చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక 75వ రిపబ్లిక్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించి.. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.