Modi on Nepal: నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సుశీలా కార్కీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (Modi on Nepal) శుభాకాంక్షలు తెలిపారు. భారత్కు నేపాల్ సన్నిహిత మిత్రదేశమని (క్లోజ్ ఫ్రెండ్) ఆయన గుర్తుచేశారు. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కార్కీ నియామకం మహిళా సాధికారితకు గొప్ప ఉదాహరణ అని కొనియాడారు. భారత్, నేపాల్ ఇరుదేశాలు చరిత్రాక, ఆధ్యాత్మికత, సంస్కృతి పరంగా బలమైన సంబంధాలు కలిగివున్నాయని, స్నేహపూర్వక దేశాలని మోదీ గుర్తుచేశారు. నేపాల్ పునఃవ్యవస్థీకరణ దశలో ఉన్న సమయంలో ఆ దేశ ప్రజలకు భారత్ మద్దతుగా నిలిచిందని మోదీ చెప్పారు. గత కొన్ని రోజులుగా నేపాల్లో తీవ్రమైన అశాంతి పరిస్థితులు నెలకొన్నాయని, ఆ దేశం తిరిగి శాంతి, అభివృద్ధి పథంలో నడవాలంటూ మోదీ ఆకాంక్షించారు. జెన్ జెడ్ (GenZ) ఉద్యమం తర్వాత, యువత వీధుల్లో స్వచ్ఛతా కార్యక్రమాలను చేపట్టడం నిజంగా అభినందనీయమని మోదీ ప్రశంసించారు. మణిపూర్లోని ఇంఫాల్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also- Krishna Water Dispute: చుక్క నీరు కూడా వదలం.. తెలంగాణ వాటా సాధిస్తాం.. మంత్రి ఉత్తమ్ కుమార్
నేపాల్ మధ్యంతర ప్రభుత్వానికి ప్రధానమంత్రి పదవిని స్వీకరించిన సందర్భంగా, 140 కోట్ల మంది భారతీయుల తరఫున సుశీలాకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని మోదీ అన్నారు. నేపాల్ను శాంతి, స్థిరత్వం, సుసంపన్న మార్గంలో నడిపించానికి ఆమె బాటవేస్తారనే పూర్తి విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘‘నేపాల్లో చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితుల మధ్య ఎవరూ పెద్దగా గుర్తించని ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే, గత రెండు మూడు రోజులుగా, నేపాల్ యువకులు, యువతులు ఎంతో శ్రమకూర్చుతూ వీధులను శుభ్రం చేస్తున్నారు. పెయింటింగ్ వర్క్స్ కూడా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు, ఫోటోలు నేను సోషల్ మీడియాలో కూడా చూశాను’’ అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేపాల్ యువత సానుకూల ఆలోచనలు, పనులు కేవలం ప్రేరణ కలిగించేవి మాత్రమే కాదని, నేపాల్లో నూతన శకం మొదలవబోతోందనడానికి స్పష్టమైన సంకేతమని అభివర్ణించారు. నేపాల్ యువతకు బంగారు భవిష్యత్ ఉంటుందని అన్నారు. యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మోదీ పేర్కొన్నారు.
Read Also- Jangaon Protest: వంతెన నిర్మాణం చేసేదాక మా ఊరు రావోద్దు.. గ్రామస్తుల ఆందోళన
మణిపూర్లో మోదీ పర్యటన
కుకీ-మైతేయ్ తెగల మధ్య హింసాత్మక ఘర్షణలతో రాష్ట్రమంతా అట్టుడికిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తొలిసారి మణిపూర్ రాష్ట్రంలో (Modi Manipur Visits) పర్యటించారు. భయోత్పాతంతో ఇప్పటికీ పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చురాచాంపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ, మణిపూర్ రాష్ట్ర వాసులకు కీలక సందేశం ఇచ్చారు. సరికొత్త ఉదయం మణిపూర్ తలుపుతడుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన బాధితుల్లో నూతన ఆశలు చిగురిస్తున్నాయని ఆయన చెప్పారు. ‘‘మణిపూర్ రాష్ట్రం ఆశలు, ఆకాంక్షలకు నిలయమైన నేల. అయితే, దురదృష్టవశాత్తూ ఈ ప్రాంత అందాలను అల్లర్ల అంధకారం కప్పివేసింది. కొద్ది సేపటి క్రితం నేను శరణార్థ శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులను కలిశాను. విశ్వాసం, ఆశలు మణిపూర్లో ఉదయిస్తున్నాయని నేను ఆత్మవిశ్వాసంతో చెప్పగలను’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.