Delhi Car Blast: దిల్లీ పేలుడు ఘటనలో గాయపడ్డ వారిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) పరామర్శించారు. భూటాన్ పర్యటన (Bhutan Tour)ను ముగించుకొని దిల్లీ వచ్చిన మోదీ.. ఆపై నేరుగా బాధితులు చికిత్స పొందుతున్న లోక్ నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రి (Lok Nayak Jai Prakash – LNJP) కి వెళ్లారు. గాయపడ్డ వారి దగ్గరకు వ్యక్తిగతంగా వెళ్లి పరామర్శించారు. యావత్ దేశం అండంగా ఉందంటూ వారిలో స్థైర్యాన్ని నింపారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
‘బాధ్యులను శిక్షిస్తాం’
ప్రధాని మోదీ ఆస్పత్రిలోకి ప్రవేశించిన తీరు ఆసక్తికరంగా మారింది. ఆస్పత్రి ప్రధాన ఎంట్రన్స్ నుంచి కాకుండా.. వెనుకవైపుగా లోనికి ప్రవేశించారు. ఆస్పత్రి ప్రవేశ ద్వారం వద్ద పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు ఉండటంతో మోదీ ఇలా చేసినట్లు తెలుస్తోంది. బాధితుల పరామర్శ అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా మోదీ పంచుకున్నారు. ‘ఢిల్లీ పేలుడులో గాయపడిన వారిని కలిసేందుకు LNJP ఆసుపత్రికి వెళ్లాను. అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ కుట్ర వెనుక ఉన్న వారిని న్యాయస్థానం ఎదుటకు తీసుకువస్తాం’ అని ప్రధాని మోదీ ఎక్స్ లో రాసుకొచ్చారు.
Went to LNJP Hospital and met those injured during the blast in Delhi. Praying for everyone’s quick recovery.
Those behind the conspiracy will be brought to justice! pic.twitter.com/HfgKs8yeVp
— Narendra Modi (@narendramodi) November 12, 2025
భూటాన్ వేదికగా వార్నింగ్..
దిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 మంది గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన అనంతరం కూడా ప్రధాని మోదీ తన భూటాన్ పర్యటనను కొనసాగించారు. థింపూ (Thimphu)లో జరిగిన గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ (Global Peace Prayer Festival)లో పాల్గొని ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా దిల్లీ పేలుడు సూత్రదారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అప్పటివరకూ హిందీలో ప్రసంగించిన మోదీ.. ఒక్కసారిగా ఇంగ్లీషులో మాట్లాడుతూ యావత్ ప్రపంచానికి తెలిసేలా వార్నింగ్ ఇచ్చారు. దిల్లీలో పేలుడుకు కారణమైన సూత్రదారులు, పాత్రదారులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
Also Read: Al Falah University: ఉగ్రవాదులకు అడ్డా అంటూ ఆరోపణలు.. స్పందించిన అల్-ఫలాహ్ యూనివర్శిటీ
‘తగిన శాస్తి చేస్తాం’
దిల్లీ పేలుడు నేపథ్యంలో మూలాల్లోకి వెళ్లి మరి కలుగులో దాక్కున్న ప్రతి ఒక్కరిని బయటకు లాగుతామని ప్రధాని అన్నారు. దేశంపై దాడి చేసిన వారికి తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పేలుడు జరిగిన రాత్రంతా పరిస్థిని సమీక్షించినట్లు మోదీ తెలిపారు. చాలా బరువెక్కిన హృదయంతో భూటాన్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పారు. దిల్లీలో జరిగిన దారుణ ఘటన అందరినీ తీవ్రంగా బాధపెట్టిందని మోదీ అన్నారు.
