Kolkata Case: కోల్కతాలో న్యాయశాస్త్రం చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థినిపై ఇటీవల సామూహిక అఘాయిత్యం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా ఇప్పటికే అరెస్ట్ అవ్వగా, అతడికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
మిశ్రా నేరానికి పాల్పడడం ఇదే తొలిసారికాదు. గతంలోనూ అతడికి పెద్ద నేర చరిత్రే ఉంది. మిశ్రాపై అనేక నేరారోపణలు ఉన్నాయి. అతడొక ‘హిస్టరీ షీటర్’ అని తేలింది. మిశ్రాపై లైంగిక వేధింపులు, దాడులు, విధ్వంసం, దొంగతనం వంటి పలు కేసులు ఉన్నాయి. ఈ మేరకు చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. కోల్కతా పరిధిలో అతడిపై ఈ కేసులు ఉన్నాయని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాలీఘాట్, కస్బా, అలిపోర్, హరిదేవ్ పూర్, టోలీగంజ్ పోలీస్ స్టేషన్లలో అతడిపై పలు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
Read this- Raja Singh: బీజేపీకి రాజాసింగ్ రాజీనామా.. లవ్ లెటర్ ఇచ్చి..
ఓ మహిళ దుస్తులు చించివేత
మనోజిత్ మిశ్రా నేర చరిత్ర చాలాకాలం కిందటే మొదలైంది. 2019లో అదే లా కళాశాల క్యాంపస్లో ఒక మహిళ దుస్తులు చింపాడు. ఈ ఘటనకు సంబంధించి చార్జిషీట్ దాఖలైంది. అదే ఏడాది న్యూఇయర్ వేడుకల సందర్భంగా, హరిదేవ్ పూర్లోని ఒక ఫ్రెండ్ ఇంట్లో మిశ్రా దొంగతానికి పాల్పడ్డాడు. ఒక బంగారు గొలుసు, మ్యూజిక్ సిస్టమ్, పెర్ఫ్యూమ్ వంటి వస్తువులను దొంగిలించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇక, 2022 కస్బా ప్రాంతంలో ఒక మహిళను వేధించాడు. గతేడాది 2024 మే నెలలో ఒక సెక్యూరిటీ గార్డుపై దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు, క్యాంపస్లో ఆస్తిని కూడా ధ్వంసం చేయడంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మిశ్రా తండ్రి ఆలయ పూజారి
మనోజిత్ మిశ్రా కలకత్తాలోని కాలిఘాట్ ప్రాంతానికి చెందిన ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. మనోజిత్ తండ్రి రాబిన్ మిశ్రా ఒక ఆలయంలో పూజారిగా కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇక తల్లి నరాల సమస్యలతో బాధపడుతున్నారు. తరచూ రాజకీయ కార్యకలాపాలు, ఎప్పుడు చూసినా తగాదాలు పెట్టుకొస్తుండడంతో మనోజిత్కు తండ్రి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.
Read this- Viral News: చెత్త ట్రక్లో మహిళ డెడ్బాడీ.. దర్యాప్తు చేస్తే..
కాలేజీలో అఘాయిత్యానికి పాల్పడిన మిశ్రా ప్రస్తుతం ‘లా స్టూడెంట్’ కాదు. అయితే, క్యాజువల్ ప్రాతిపదికనను దాదాపు 45 రోజుల క్రితమే కాంట్రాక్టు ప్రాతిపదికన కాలేజీ పాలకమండలి నియమించుకుంది. ఈ విషయాన్ని కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ నయన ఛటర్జీ వెల్లడించారు. టీఎంసీ ఎమ్మెల్యే అశోక్ కుమార్ దేబ్ కాలేజీ పాలకమండలి అధ్యక్షుడిగా ఉన్నారని ఆయన వివరించారు. అయితే, తాను సిఫార్సు చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని ఎమ్మెల్యే దేబ్ ఖండించారు.
కాలేజీలో టీచింగ్ ఫ్యాకల్టీగా చేరిన మనోజిత్ మిశ్రా అలీపూర్ కోర్టులో లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. జూన్ 25న కాలేజీ క్యాంపస్లో మొదటి సంవత్సరం విద్యార్థినిపై మరో ఇద్దరితో కలిసి అత్యాచారాని ఒడిగట్టాడు. ఆ రోజు రాత్రి 7:30 నుంచి రాత్రి 10:50 గంటల మధ్య జరిగింది. సెక్యూరిటీ గార్డు రూమ్లో ఈ దారుణం జరిగింది. మనోజిత్ మిశ్రా ప్రధాన నిందితుడు కాగా, సహ నిందితులుగా ఉన్న జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీ (20) ఇద్దరూ కాలేజీ విద్యార్థులు. వీరు ముగ్గుర్ని గురువారం అరెస్టు చేయగా, గార్డును శనివారం అదుపులోకి తీసుకున్నారు.