Karnataka Mysterious: కర్ణాటకలోని హనుమంతపుర గ్రామం (Hanumanthapura village)లో పెద్ద ఎత్తున నెమళ్లు (Peacocks) మృతి చెందటం కలకలం రేపుతోంది. నెమలి జాతీయ పక్షి కావడంతో.. దేశవ్యాప్తంగా ఈ వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామంలో మెుత్తం 20 నెమళ్లు అనుమానస్పదంగా మృతి చెందగా అందులో 3 మగ, 17 ఆడ ఉన్నాయి. ఈ నెమళ్ల మృతదేహాలను గ్రామంలోని ఒక వాగు పక్కన పొలాల్లో చిందరవందగా పడి ఉండటాన్ని రైతులు గుర్తించారు.
రంగంలోకి అటవీశాఖ
మరోవైపు నెమళ్ల అసహజ మరణంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. హుటా హుటీనా ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. నెమళ్ల మరణానికి గల కారణం తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించారు. నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇటీవల కర్ణాటకలో 20 కోతులు, ఒక పులి (ఆడది), నాలుగు పులి పిల్లల అసహజ మరణాల తరువాత నెమళ్లు కూడా చనిపోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
20 కోతులు, పులి సైతం..
జూలై 2న చామరాజనగర్ జిల్లాలో 20 కోతుల (20 Monkeys) మృతదేహాలు లభించాయి. కోతులు విషప్రయోగం చేయబడి చనిపోయినట్లు అటవీ, పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. అంతకుముందు జూన్లో జాతీయ జంతువు అయిన పులి (ఆడది) దాని నాలుగు పిల్లల ఆకస్మిక మరణం అందరిని కలచివేసింది. మలే మహాదేశ్వర హిల్స్ వన్యప్రాణి అభయారణ్యంలో జరిగిన ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. విషపూరితమైన ఆవు మాంసం (Cow Meat) తినడం వల్ల ఆ పులి, దాని పిల్లలు మరణించినట్లు అధికారులు తేల్చారు.
Also Read: Health Tips: 30 మ్యాజిక్ టిప్స్.. మీకు తెలియకుండానే రోజుకు 10,000 స్టెప్స్ నడిచేస్తారు!
గ్రామస్తులే చేశారా?
వన్యప్రాణి వర్గాల సమాచారం ప్రకారం.. ఆడ పులి ఒక ఆవును చంపి అటవీ ప్రాంతానికి ఈడ్చుకెళ్లింది. ఆ పులి, నాలుగు పిల్లలు కొంత మాంసం తిన్నాయి. అయితే స్థానిక గ్రామస్థులు ఆవు మృతదేహాన్ని గుర్తించి దానిని విషపూరితం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. తర్వాత పులి, దాని పిల్లలు తిరిగి ఆ మృతదేహం దగ్గరకు వెళ్లి మాంసం తిని చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.