Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) ఆకస్మిక రాజీనామా వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. అనారోగ్య కారణాలే రాజీనామాకు కారణాలంటూ ధన్ఖడ్ తన రిజైన్ లెటర్లో పేర్కొన్నప్పటికీ, లోలోపల పెద్ద రాజకీయ డ్రామా నడిచినట్టు జాతీయ మీడియాలో కథనాలు గుప్పుమంటున్నాయి. జగదీప్ ధన్ఖడ్ రాజీనామా ప్రకటించడానికి ముందు కేంద్ర ప్రభుత్వానికి, ఆయనకు మధ్య అగాధం చోటుచేసుకుందని, కీలక పరిణామాలు జరిగినట్టు తెలుస్తోంది. తన నివాసంలో భారీగా నోట్ల కట్టలతో పట్టుబడ్డ సుప్రీంకోర్టు జడ్జి యశ్వంత్ వర్మను తొలగించాలంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ధన్ఖడ్ ఆమోదించడం (రాజ్యసభలో) కేంద్రానికి రుచించలేదని తెలుస్తోంది.
నిజానికి, న్యాయమూర్తి యశ్వంత్ వర్మను తొలగింపునకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు కూడా సిద్ధమైంది. అందుకు సంబంధించిన తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టాలని, తద్వారా విపక్షాలపై పైచేయి సాధించాలని వ్యూహరచన చేసింది. ఇంతలోనే కనీసం ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే రాజ్యసభలో విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్గా ఉన్న ధన్ఖడ్ ఆమోదించడంతో ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఇంకా చెప్పాలంటే ఈ పరిణామంతో కేంద్ర ప్రభుత్వం ఒకింత షాక్కు కూడా గురైంది. అనంతరం కేంద్రం-ధన్ఖడ్కు మధ్య జరిగిన పరిణామాలే ఆయన రాజీనామా వరకు దారితీశాయని జాతీయ మీడియా ఛానల్ ‘ఎన్డీటీవీ’ కథనం పేర్కొంది.
Read Also- Dhankhar: ధన్ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం.. మోదీ ఏమన్నారంటే
విపక్షాల తీర్మానాన్ని రాజ్యసభలో ఆమోదించడంపై కేంద్రం తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించడం ద్వారా న్యాయ వ్యవస్థలో అవినీతి విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉందని చాటిచెప్పుకోవాలని మోదీ సర్కార్ భావించింది. కానీ, ధన్ఖడ్ చర్యతో పార్లమెంట్లో ప్రభుత్వ పెత్తనం దిగజారినట్టు అయ్యిందని ప్రభుత్వ వర్గాలు చిన్నబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. విపక్షాల తీర్మానాన్ని ధన్ఖడ్ ఆమోదించిన వెంటనే ప్రధాని మోదీతో కొంతమంది కేంద్ర మంత్రులు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కార్యాలయంలో సమావేశమై బీజేపీ రాజ్యసభ ఎంపీలను బృందాలు బృందాలుగా పిలిపించి మాట్లాడారు. ఒక్కో దఫాలో 10 మంది ఎంపీలను పిలిపించి ఓ ముఖ్యమైన ప్రతిపాదనపై సంతకాలు తీసుకొని, ఆ తర్వాత ఎన్డీయే మిత్రపక్షాల ఎంపీల నుంచి కూడా సంతకాలు సేకరించారని ‘ఎన్డీటీవీ’ వివరించింది.
బీజేపీతో పాటు ఎన్డీయే ఎంపీలందరూ నాలుగు రోజులపాటు ఢిల్లీలోనే ఉండాలని సూచించినట్టుగా తెలుస్తోంది. తక్షణ చర్యలు ఏమైనా తీసుకోవాల్సి వచ్చినా ఇబ్బందికూడదని పేర్కొన్నట్టు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం కూడా బీజేపీ నాయకత్వం మరోసారి ఎంపీలను పిలిపించి మాట్లాడిందట. ధన్ఖడ్ గతంలో ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భాలను, గవర్నర్గా ఉన్న సమయంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను ప్రస్తావించి మరీ బీజేపీ పెద్దలు తమ అసహనాన్ని వ్యక్తిపరిచినట్టు ఎన్డీటీవీ పేర్కొంది. మొత్తంగా వేగంగా మారుతున్న పరిణామాలను గమనించిన ధన్ఖడ్ ఆకస్మికంగా తన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా ప్రకటించారు. దీంతో, గతంలో ఆయననపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన ప్రతిపక్షాలు ఇప్పుడు ధన్ఖడ్కు మద్దతుగా నిలవడం ఆసక్తికరంగా మారింది.
Read Also-Air India: ఎయిరిండియా విమానంలో మంటలు.. మరో షాకింగ్ ఘటన