Visa In Just 1 day: ఇప్పటి వరకు వీసా జారీ చేయడానికి కొన్ని వారాల సమయం పట్టేది. అన్ని పత్రాలు సమర్పిస్తే ఇకపై ఒక్క రోజులోనే వీసాను పొందే అవకాశాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో వెసులు బాటు తీసుకొచ్చింది. అట్లాగే అక్రమ వలసదారులు, గడువు మించి ఉండే విదేశీయులపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు డిస్ట్రిక్ట్ పోలీస్ మాడ్యూల్(డీపీఎం), ఫారినర్స్ ఐడెంటిఫికేషన్ పోర్టల్(ఎఫ్ఐపీ) అనే రెండు కొత్త పోర్టల్స్ను ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అధ్యక్షతన న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్లో విదేశీ విభాగం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వీసాల విధానాల సరళతరం, ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల ఆధునీకరణ వంటి అంశాలపై చర్చించారు.
Also Read: Hyderabad Rains: భారీ వర్షాలు.. ఇందిరమ్మ టిఫిన్స్ కార్యక్రమం వాయిదా
ఈ సందర్బంగా ఆయా అంశాల్లో పురోగతిని అధికారులకు కేంద్ర మంత్రికి వివరించారు. వీసా(Visa) విధానాన్ని సులభతరం చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గతంలో వీసా((Visa) పొందేందుకు 26 సబ్ కేటగిరీలుండగా వాటిని 22కి కుదించామని, అలాగే గతంలో 104 సబ్ కేటగిరీలుంటే 69కి తగ్గించినట్లు వెల్లడించారు. 2024లో జారీ చేసిన మొత్తం వీసాల్లో ఈ-వీసాల వాటా 65.15 శాతంగా ఉందన్నారు. వీసా విధానాల సులభతరం వల్ల వీసా జారీ సగటు సమయం కొన్ని వారాల నుంచి ఒక రోజులోపు తగ్గినట్లు తెలిపారు.
ఆటోమేటెడ్ ట్రావెల్ డాక్యుమెంట్ స్కానింగ్, బయోమెట్రిక్
ఇదిలా ఉండగా ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు(ఐసీపీ)ల ఆధునీకరణలో భాగంగా ఆటోమేటెడ్ ట్రావెల్ డాక్యుమెంట్ స్కానింగ్, బయోమెట్రిక్ నమోదు సదుపాయాలను కల్పించినట్లు అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. 2014 నాటికి దేశంలో 82 ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టులుండగా, ప్రస్తుతం 114కి (వీటిలో 37 ఎయిర్, 37 రోడ్డు, 34 సముద్ర, 6 రైల్వే) పెంచినట్లు తెలిపారు. అలాగే ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్లలో ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రీ-వెరిఫైడ్ ప్రయాణికులు ఈ విమానాశ్రయాల్లో కేవలం ఒకే ఒక్క నిమిషంలోనే ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పొందవచ్చునని వివరించారు.
త్వరలో ఈ సౌకర్యాన్ని కోజికోడ్, లక్నో, తిరువనంతపురం, అమృత్సర్, తిరుచిరాపల్లి, నోయిడా, నవి ముంబై విమానాశ్రయాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 50 లక్షల ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డులు జారీ చేయడంతోపాటు ఓసీఐ పోర్టల్ను పునరుద్ధరించి మరింత సులభమైన సేవలు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లకు చెందిన 6 నిర్దిష్ట మైనారిటీ సమూహాల పౌరసత్వ దరఖాస్తుదారులకు సాయం చేయడానికి ‘సీఏఏ-2019’ మొబైల్ యాప్ అభివృద్ధి చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరును కేంద్ర మంత్రి అభినందించారు. వీసా, ఇమ్మిగ్రేషన్ విషయంలో ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలను, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో సాధారణ ప్రజలకు చేరవేయాలని ఆదేశించారు.
కరీంనగర్, సిరిసిల్ల కలెక్టర్లకు బండి ఫోన్
కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝా లకు ఫోన్ చేశారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి నార్త్ బ్లాక్లోని తన కార్యాలయం నుంచి ఆయా కలెక్టర్లకు ఫోన్లు చేసి ఆయా జిల్లాల్లో ఇప్పటి వరకు కురిసిన వర్షాలు, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలపై ఆరా తీశారు.
ఆకస్మిక వరదలు సంభవిస్తే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్కు సంబంధించి అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా మొబైల్ ట్రాన్స్ఫర్స్ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రెండు జిల్లాల పరిధిలో ప్రజలకు ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా 24 గంటలు అందుబాటులో సిబ్బంది సేవలను ఉంచాలని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బండి సంజయ్ ప్రజలకు సూచించారు.
Also Read: Gadwal Rains: మూడు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ కీలక సూచనలు